Kalyandurgam: కాన్వాయ్ వదిలి స్కూటీపై వెళ్లిన ఎమ్మెల్యే
Kalyandurgam: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తన అధికారిక వాహన శ్రేణిని పక్కనపెట్టారు.
Kalyandurgam: కాన్వాయ్ వదిలి స్కూటీపై వెళ్లిన ఎమ్మెల్యే
Kalyandurgam: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఇంధన వినియోగాన్ని తగ్గించే దిశగా ఆలోచించాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఇంధన పొదుపు చర్యల్లో తాను కూడా భాగస్వామి అయ్యానని ఎమ్మెల్యే తెలిపారు.
ఇందులో భాగంగా తన అధికార వాహన శ్రేణిని పక్కనపెట్టి, అనంతపురం లోని స్వగృహం ‘బృందావనం’ నుంచి వ్యక్తిగత కార్యాలయానికి ఎలక్ట్రిక్ స్కూటీపై ప్రయాణించారు. ఎమ్మెల్యే సాధారణ వాహనంలో ప్రయాణించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ వినియోగం దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పెంచుతోందన్నారు. అంతేకాకుండా వాయు కాలుష్యం, పర్యావరణ సమస్యలు కూడా అధికమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించాలంటే ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగంపై దృష్టి పెట్టాలని సూచించారు.ప్రజలు వీలైనంత వరకు ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించాలని, చిన్న చిన్న పనుల కోసం భారీ వాహనాల వినియోగాన్ని తగ్గించాలని ఎమ్మెల్యే సూచించారు. అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగాన్ని పెంచడం ద్వారా ఇంధన వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చన్నారు. కుటుంబ ఆర్థిక భారం తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.
దేశాభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు కూడా సహకరించాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కోరారు. ఇంధన పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని ఆయన సూచించారు.




