Anantapur: ఎస్ఐఆర్ ఓటర్ల సర్వేను సక్సెస్ చేయండి.. ఎమ్మెల్యే దగ్గుబాటి
Anantapur: నియోజకవర్గంలోని 285 పోలింగ్ బూత్లలో బీఎల్ఏలు తప్పనిసరిగా ఎస్ఐఆర్ ఓటర్ల సర్వేలో పాల్గొనాలని ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆదేశించారు.
Anantapur: ఎస్ఐఆర్ ఓటర్ల సర్వేను సక్సెస్ చేయండి.. ఎమ్మెల్యే దగ్గుబాటి
Anantapur: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పిలుపునిచ్చారు. అర్బన్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సులో క్లస్టర్, యూనిట్, డివిజన్ ఇంచార్జ్లతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు.
నియోజకవర్గంలోని 285 పోలింగ్ బూత్లలో బూత్ లెవెల్ ఏజెంట్లు తప్పనిసరిగా ఎస్ఐఆర్ కార్యక్రమంలో పాల్గొనాలని ఎమ్మెల్యే సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేసే పూర్తి బాధ్యత క్లస్టర్, యూనిట్ ఇంచార్జ్లదేనని స్పష్టం చేశారు.
ఈ నెల 15వ తేదీ నుంచి నిర్వహించే క్షేత్రస్థాయి సర్వేలో బూత్ లెవెల్ ఆఫీసర్లతో పాటు బీఎల్ఏలు కూడా చురుకుగా పాల్గొనాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ఎవరికైనా సందేహాలు ఉంటే వెంటనే నివృత్తి చేసుకోవాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని సూచించారు.
అర్హత ఉన్న ఒక్క ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా ప్రతి ఓటును జాగ్రత్తగా పరిశీలించి నమోదు చేయాలని తెలిపారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో జరిగిన ఓట్ల చేర్పులు, మార్పుల్లో అక్రమాలపై ప్రత్యేక నిఘా ఉంచి దొంగ ఓట్లను గుర్తించి తొలగించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
పార్టీ తరఫున జరిగే ప్రతి కార్యక్రమాన్ని మంత్రి నారా లోకేష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎక్కడైనా నిర్లక్ష్యం కనిపిస్తే పార్టీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణిస్తుందని, ఉపేక్షించే పరిస్థితి ఉండదని హెచ్చరించారు.
ప్రతి బుధవారం నిర్వహించే పార్టీ అధికారిక సమావేశాల్లో నాయకులు, కార్యకర్తలు, ఇంచార్జ్లు తప్పనిసరిగా పాల్గొని క్షేత్రస్థాయి పురోగతిని నివేదించాలని ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ సూచించారు.




