Anantapur: పర్యావరణ ర్యాలీలో కలెక్టర్, ఎమ్మెల్యే
Anantapur: పర్యావరణ పరిరక్షణకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సరికొత్త పిలుపు.
Anantapur: పర్యావరణ ర్యాలీలో కలెక్టర్, ఎమ్మెల్యే
అనంతపూర్: పర్యావరణ పరిరక్షణ కోసం వారంలో కనీసం ఒక్కరోజైనా ఇంధన వాహనాలను పక్కన పెట్టి.. సైకిల్ వినియోగించాలని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు ఆయన సైకిల్ పై ప్రయాణం చేశారు.
ఉదయం తన ఇంటి వద్ద నుంచి ఎమ్మెల్యే దగ్గుపాటి సైకిల్ పై కలెక్టరేట్ కు బయలుదేరారు. ఆయన వెంట టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు సైతం సైకిళ్లలో కదిలారు. కలెక్టరేట్ వరకు ఆయన సైకిల్ తొక్కారు. అక్కడ జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ తో కలిసి పర్యావరణ దినోత్సవ ర్యాలీని ఆయన ప్రారంభించారు.
ఈకార్యక్రమంలో అటవీశాఖతో పాటు వివిధ శాఖల అధికారులు, ఎన్జీఓలు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఒక్క రోజు సైకిల్ తొక్కినా మనకు ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు.
ప్రతి ఏటా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని... అవి తగ్గాలంటే అటవీ సంపద పెరగాలన్నారు. అందుకే జిల్లాలో కోటి మొక్కలు నాటాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. మరోవైపు జిల్లాలో కోటికి పైగా మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. కనీసం 50సంస్థల్లో నెట్ జీరో కాన్సెప్ట్ లోకి మార్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. అల్ట్రా హైడెన్సీ ప్లాంటేషన్ కు శ్రీకారం చుట్టబోతున్నట్టు కలెక్టర్ తెలిపారు.




