Dharmavaram: తాగునీటి ప్రాజెక్టుకు రూ.31.73 కోట్ల మంజూరు
Dharmavaram: ధర్మవరం పట్టణంలో శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి అమృత్ 2.0 కింద రూ.31.73 కోట్ల నిధులు మంజూరయ్యాయి.
Dharmavaram
Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి శాశ్వత తాగునీటి పరిష్కారం కల్పించేందుకు అమృత్ 2.0 పథకం కింద రూ.31.73 కోట్ల నిధులు మంజూరయ్యాయి.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మరియు ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక చొరవతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ నిధులు మంజూరైనట్లు నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా పట్టణంలో భారీ స్థాయిలో తాగునీటి సరఫరా అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆధునిక సాంకేతిక ప్రమాణాలతో ప్రాజెక్ట్ రూపుదిద్దుకున్నట్లు పేర్కొన్నారు.
ప్రాజెక్ట్లో భాగంగా సీబీఆర్ సమీపంలోని ఇన్టేక్ వెల్ వద్ద అధునాతన వర్టికల్ టర్బైన్ పంప్ సెట్లు, తమ్మాపురం వద్ద సెంట్రిఫ్యూగల్ పంప్ సెట్లు ఏర్పాటు చేయనున్నారు.
రామ్నగర్-2, శాంతినగర్, గిర్రాజు కాలనీల్లో భారీ సామర్థ్యంతో ఆర్సీసీ ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్లు నిర్మించనున్నారు. అదేవిధంగా ఆధునిక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ధర్మవరం పట్టణవ్యాప్తంగా 35 వేల మీటర్లకు పైగా హెచ్డీపీఈ పైప్లైన్లు వేయడంతో పాటు ఆధునిక ఎస్సీఏడీఏ, ఆటోమేషన్ వ్యవస్థలను అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
ప్రజలకు 24 గంటల పాటు నాణ్యమైన తాగునీటి సరఫరా అందించడమే లక్ష్యమని హరీష్ బాబు తెలిపారు.




