Anantapur: అనంతపురంలో అనంత వెంకటరామిరెడ్డి ధర్నా
Anantapur: కూటమి ప్రభుత్వ రెండేళ్ల వైఫల్యాలపై నిప్పులు.. రూ. 4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ఆగ్రహం.
Anantapur: అనంతపురంలో అనంత వెంకటరామిరెడ్డి ధర్నా
అనంతపూర్: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో, అనంతపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన బాట పట్టారు. అనంతపురం టౌన్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
రెండేళ్ల క్రితం రాష్ట్రంలో వెన్నుపోటు పాలన ప్రారంభమైందని మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు.ఈ రెండేళ్ల కాలంలో ప్రజలకు ఉపయోగపడే ఒక్క కొత్త సంక్షేమ పథకాన్ని కూడా ప్రభుత్వం అమలు చేయలేకపోయిందని విమర్శించారు. గత 2014-19 నాటి పథకాలకు ప్రస్తుత పాలనలో చంద్రగ్రహణం పట్టిందని ఎద్దేవా చేశారు.
నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి హామీని ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఏకంగా రూ. 4 వేల కోట్లు దాటాయి. ఈ బకాయిల కారణంగా విద్యార్థులు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళలకు ఇస్తామన్న రూ. 15 వేల ఆర్థిక సాయం హామీ అమలుకు నోచుకోలేదన్నారు. అలాగే డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని కూడా ప్రభుత్వం అటకెక్కించింది.
కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి ప్రజలను నమ్మించి మోసం చేశాయని అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం పక్కన పెట్టి, ప్రతిపక్షాలపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని, కేవలం దౌర్జన్యాలు, అక్రమాలే ఈ పాలనలో కనిపిస్తున్నాయని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చివరిగా కుటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కరపత్రాలను కాల్చి నిరసన వ్యక్తం చేశారు.




