CM Chandrababu: అధికారుల పనితీరుపై ‘చంద్రబాబు’ మార్క్ రివ్యూ.. ఇకపై నేరుగా ప్రజల ముందుకు ప్రోగ్రెస్ రిపోర్ట్!

CM Chandrababu: అధికారుల పనితీరుపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం. ఇకపై నేరుగా ప్రజల ముందుకే అధికారుల ప్రోగ్రెస్ రిపోర్ట్.

HARIKISHAN, Krishna & NTR Dst
Published on: 2 April 2026 11:43 AM IST
CM Chandrababu
X

CM Chandrababu: అధికారుల పనితీరుపై ‘చంద్రబాబు’ మార్క్ రివ్యూ.. ఇకపై నేరుగా ప్రజల ముందుకు ప్రోగ్రెస్ రిపోర్ట్!

CM Chandrababu: రాష్ట్ర పరిపాలనలో పారదర్శకతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఇకపై అధికారుల పనితీరును నేరుగా ప్రజల ముందుకు తీసుకువస్తానని స్పష్టం చేస్తూ, బాధ్యతాయుత పాలనకు నూతన ప్రమాణాలు తీసుకురావాలని సంకల్పించారు. రాష్ట్ర సచివాలయంలో ఆర్టీజీఎస్ ద్వారా వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ప్రణాళికలు ప్రజలకు చేరే విధంగా అధికార యంత్రాంగం మరింత చురుకుగా వ్యవహరించాలన్నారు. కేవలం పథకాలు అమలు చేయడమే కాకుండా, వాటి ప్రభావాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించడం కూడా సమానంగా ముఖ్యమని పేర్కొన్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడంలో అధికారులు ముందుండాలని సూచించారు.

జిల్లా పర్యటనల సమయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరును సమీక్షిస్తానని సీఎం ప్రకటించారు. పనితీరు బాగున్న అధికారులను ప్రోత్సహిస్తూ, లోపాలు ఉన్నవారిని సరిదిద్దే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడానికీ వెనుకాడబోమన్నారు.

ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచడం కోసం శిక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని సీఎం వెల్లడించారు. అమరావతిలో రాష్ట్ర స్థాయి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు, ప్రాంతాల వారీగా జోనల్ ట్రైనింగ్ సెంటర్లను స్థాపించాలని సూచించారు. సాంకేతికత వినియోగంతో ప్రభుత్వ సేవలను వేగవంతంగా అందించడమే లక్ష్యమని చెప్పారు.

ప్రభుత్వ సేవల్లో ప్రజా కోణాన్ని ఎప్పటికీ మరిచిపోకూడదని సీఎం స్పష్టం చేశారు. ప్రజలకు అందించే సేవలు సులభంగా, పారదర్శకంగా ఉండాలని, ప్రభుత్వం ప్రజలకు అండగా ఉందనే నమ్మకం పెంచే విధంగా అధికారులు పనిచేయాలని సూచించారు. ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా సేవలందించే ఉద్యోగులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించారు.

కుల ధృవీకరణ పత్రాల జారీ విషయంలో జరిగిన లోపాలను సీఎం గమనించి, వాటిని వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు. గతంలో జరిగిన పొరపాట్ల వల్ల వచ్చిన సమస్యలను పరిష్కరించడంలో అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ పత్రాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు అవసరమని పేర్కొన్నారు.

శాంతిభద్రతల పరిరక్షణలో టెక్నాలజీ వినియోగం కీలకమని సీఎం తెలిపారు. మిస్సింగ్ కేసుల ట్రేసింగ్, నేర నియంత్రణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. సీసీటీవీ నెట్‌వర్క్‌ను విస్తరించి ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయాలని అన్నారు.

యువతలో నైపుణ్యాలను వెలికితీయడంలో ఇన్నోవేషన్ హబ్‌ల పాత్రను సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందించేందుకు ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవాలని సూచించారు. యూనివర్శిటీల్లో ఇన్నోవేషన్ కార్యకలాపాలను విస్తరించి, యువతకు అవకాశాలు కల్పించాలని అన్నారు.

పరిపాలనలో బాధ్యత, పారదర్శకత, సాంకేతికత ఆధారిత వ్యవస్థను తీసుకువచ్చే దిశగా సీఎం చేసిన సూచనలు రాష్ట్ర పరిపాలనలో కీలక మార్పులకు దారి తీసే అవకాశముంది. అధికారులు ప్రజా కేంద్రంగా పనిచేస్తేనే ప్రభుత్వ లక్ష్యాలు సాకారం అవుతాయని సీఎం స్పష్టం చేశారు.

HARIKISHAN, Krishna & NTR Dst

HARIKISHAN, Krishna & NTR Dst

Next Story