AP Ministers Ratings : చంద్రబాబు మార్క్ పాలన.. మంత్రులకు మార్కులు వేసిన సీఎం.. టాప్‎లో అచ్చెన్నాయుడు

AP Ministers Ratings : ఏపీ సీఎం చంద్రబాబు మంత్రుల పనితీరుపై రేటింగ్స్ ఇచ్చారు. ఫైళ్ల క్లియరెన్స్‌లో అచ్చెన్నాయుడు మొదటి స్థానంలో నిలవగా, పవన్ కళ్యాణ్ నాలుగో స్థానంలో, వంగలపూడి అనిత చివరి స్థానంలో నిలిచారు.

CR Reddy
Published on: 12 March 2026 9:56 AM IST
AP Ministers Ratings
X

AP Ministers Ratings 

AP Ministers Ratings : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో పాలనలో వేగం పెంచేందుకు శ్రీకారం చుట్టారు. అమరావతి వేదికగా జరుగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో మంత్రుల పనితీరుపై ఆయన చేసిన విశ్లేషణ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం మాటలతో కాకుండా, శాఖల వారీగా ఫైళ్ల క్లియరెన్స్ వేగాన్ని ప్రామాణికంగా తీసుకుని మంత్రులకు ర్యాంకులు కేటాయించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రభుత్వ యంత్రాంగం నిద్రమత్తు వదిలి పరుగులు తీయాలన్నదే సీఎం లక్ష్యమని ఈ చర్య ద్వారా స్పష్టమవుతోంది.

ముఖ్యమంత్రి వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ఫైళ్ల క్లియరెన్స్‌లో సీనియర్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అగ్రస్థానంలో నిలిచి అందరికీ ఆదర్శంగా నిలిచారు. అచ్చెన్నాయుడు తన శాఖకు సంబంధించిన ఫైళ్లను ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరిష్కరిస్తూ మొదటి ర్యాంకును కైవసం చేసుకున్నారు. ఆయన తర్వాతి స్థానాల్లో యువ మంత్రులు నిమ్మల రామానాయుడు, కొండపల్లి శ్రీనివాస్ నిలిచారు. ఇక అందరి దృష్టి ఆకర్షించిన విషయం ఏంటంటే.. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు. అయితే హోం మంత్రి వంగలపూడి అనిత ఈ విషయంలో ఆఖరి స్థానంలో ఉండటం చర్చనీయాంశమైంది.

పాలనలో జాప్యం జరిగితే అది నేరుగా ప్రజలపై ప్రభావం చూపుతుందని చంద్రబాబు మంత్రులకు హితబోధ చేశారు. ఫైళ్లు టేబుళ్ల మీద పేరుకుపోతే అభివృద్ధి కుంటుపడుతుందని, టెక్నాలజీని వాడుకుంటూ ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. మంత్రుల పనితీరును తాను నిరంతరం గమనిస్తుంటానని, ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమేనని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. ముఖ్యంగా ప్రజలకు అత్యంత చేరువగా ఉండే శాఖల మంత్రులు మరింత వేగంగా స్పందించాలని కోరారు.

కలెక్టర్ల సమావేశం రెండో రోజు కూడా అత్యంత కీలకంగా సాగుతోంది. ఈరోజు ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖ, విద్య, రాష్ట్ర ఆదాయాన్ని పెంచే మార్గాలపై అధికారులు ప్రెజెంటేషన్లు ఇస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులు, న్యాయపరమైన చిక్కులను ఎలా అధిగమించాలనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది. ఈ సాయంత్రం శాంతిభద్రతలపై సీఎం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించనున్నారు. కలెక్టర్లు, ఎస్పీలతో కలిసి రాష్ట్రంలో నేర నియంత్రణ, మహిళల భద్రత వంటి అంశాలపై కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. మొత్తానికి చంద్రబాబు ర్యాంకుల వ్యూహం మంత్రుల్లో కొత్త ఉత్సాహాన్ని, అదే సమయంలో కాస్త టెన్షన్‌ను కూడా క్రియేట్ చేసింది.

CR Reddy

CR Reddy

Next Story