1 Lakh Jobs : లక్ష మందికి ఉద్యోగాలు.. ఉత్తరాంధ్ర దశ మార్చనున్న ఆర్సెలార్ మిట్టల్ ఉక్కు ప్లాంట్

1 Lakh Jobs : నక్కపల్లిలో రూ.1.35 లక్షల కోట్ల ఆర్సెలార్ మిట్టల్ ఉక్కు ప్లాంట్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. లక్ష ఉద్యోగాల లక్ష్యంతో, 2028 నాటికి తొలి దశ ఉత్పత్తి ప్రారంభం కానుంది.

CR Reddy
Published on: 24 March 2026 9:50 AM IST
Chandrababu Naidu
X

 Chandrababu Naidu

1 Lakh Jobs : ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో సోమవారం ఒక సువర్ణ అధ్యాయం ఆవిష్కృతమైంది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి వద్ద ప్రపంచ ప్రసిద్ధ ఉక్కు దిగ్గజం ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ఇండియా మెగా ప్లాంట్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. కేవలం 20 నెలల స్వల్ప వ్యవధిలోనే భూసేకరణ నుంచి అనుమతుల వరకు అన్ని ప్రక్రియలను పూర్తి చేసి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటో ఏపీ ప్రభుత్వం నిరూపించింది. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్ర రూపురేఖలు మారడమే కాకుండా, లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

ఈ భారీ ఉక్కు పరిశ్రమను రెండు దశల్లో నిర్మించనున్నారు. దీని ద్వారా ఏటా 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయడమే కాకుండా, దాదాపు రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్ష మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం ఉక్కు ఉత్పత్తికే పరిమితం కాకుండా, ఈ ప్లాంట్ అనుబంధంగా రూ.11,198 కోట్లతో ఒక క్యాప్టివ్ పోర్టును కూడా నిర్మిస్తున్నారు. 2028 నాటికి మొదటి దశ ఉత్పత్తి ప్రారంభించేలా ప్రభుత్వం, యాజమాన్యం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయి.

పరిశ్రమ స్థాపనతో పాటు ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు చంద్రబాబు ప్రాధాన్యతనిచ్చారు. జాతీయ రహదారిని అనుసంధానిస్తూ 4 లేన్ల రహదారిని నిర్మించడంతో పాటు, ముడి ఇనుము సరఫరా కోసం పైపులైన్ వేయనున్నారు. దీనికోసం ప్రధాని మోదీ వెంటనే అంగీకరించారని సీఎం గుర్తుచేశారు. 2030 జూన్ నాటికి మొదటి బ్లాస్ట్ ఫర్నెస్, డిసెంబర్ నాటికి రెండో ఫర్నెస్ పనులు పూర్తి కానున్నాయి. ఇక్కడ కేవలం ఫ్యాక్టరీ మాత్రమే రావడం లేదు. విద్యా సంస్థలు, అత్యాధునిక ఆసుపత్రులు, క్వార్టర్లతో నక్కపల్లి ఒక మినీ పారిశ్రామిక నగరంగా మారబోతోంది.

ఉత్తరాంధ్రను ప్రపంచ పటంలో నిలబెట్టేందుకు విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్‌ను ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. విశాఖలో త్వరలోనే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది. సుమారు 15 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐ దేశంలోనే తొలిసారిగా ఒకే చోట రావడం ఏపీకే దక్కిన గౌరవం. టీసీఎస్, కాగ్నిజెంట్, రిలయన్స్ వంటి సంస్థలతో పాటు బీపీసీఎల్ వంటి భారీ పరిశ్రమలు కూడా క్యూ కడుతున్నాయి. మూలపేట పోర్టు, భోగాపురం ఎయిర్ పోర్టు (జూలైలో ప్రారంభం) వంటి ప్రాజెక్టులతో ఈ ప్రాంతం రేర్ ఎర్త్ మినరల్ హబ్‎గా మారుతుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు.

CR Reddy

CR Reddy

Next Story