Heat Wave: ఏపీకి వడగాల్పుల హెచ్చరిక.. 23 మండలాల్లో తీవ్ర ప్రభావం
Heat Wave: ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత పెరిగింది. ఆదివారం 23 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
Heat Wave: ఏపీకి వడగాల్పుల హెచ్చరిక.. 23 మండలాల్లో తీవ్ర ప్రభావం
Heat Wave: ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత రోజు రోజుకీ పెరుగుతోంది. ఉదయం నుంచే మండే ఎండలు, మధ్యాహ్నానికి భరించలేని ఉక్కపోత, సాయంత్రం వరకూ తగ్గని వేడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మరో కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆదివారం రాష్ట్రంలోని 23 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
విజయనగరం జిల్లాలో బాడంగి, బొబ్బిలి, దత్తిరాజేరు, మెంటాడ, రామభద్రాపురం, వంగర మండలాల్లో వడగాల్పుల ప్రభావం కనిపించనుంది. అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలో బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పార్వతీపురం, సాలూరు, సీతానగరం, వీరఘట్టం మండలాల్లో కూడా వేడి గాలులు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో జీకే వీధి మండలం, పోలవరం జిల్లాలో చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, గుర్తేడు మండలాల్లో కూడా వడగాలులు ప్రభావం చూపనున్నాయి. ఈ ప్రాంతాల్లో మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇక శనివారం నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో స్పష్టం చేస్తున్నాయి. కర్నూలు జిల్లా నగరడోనలో అత్యధికంగా 44.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. కడపలో 44.2 డిగ్రీలు నమోదు కాగా, అనంతపురం జిల్లా రాయదుర్గం, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 44 డిగ్రీలు నమోదయ్యాయి. మార్కాపురం జిల్లా కంభం, శ్రీసత్యసాయి జిల్లా తలుపలలో 43 డిగ్రీలు నమోదయ్యాయి.
అన్నమయ్య జిల్లా నూలివీడు, పల్నాడు జిల్లా గురజాలలో 42.7 డిగ్రీలు, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 42.6 డిగ్రీలు, తిరుపతి జిల్లా బేస్తపల్లిలో 42.5 డిగ్రీలు నమోదయ్యాయి. అనకాపల్లి జిల్లా దేవరపల్లె, పోలవరం జిల్లా ఎర్రంపేటలో 42.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మొత్తం 28 జిల్లాల్లో 18 జిల్లాలకు చెందిన 172 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రజలు ఎండ తీవ్రతను తేలికగా తీసుకోవద్దని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం మంచిదని సూచిస్తున్నారు. బయటకు వెళ్లేటప్పుడు తలకు టోపీ లేదా గుడ్డ కట్టుకోవాలి. చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. కళ్ల రక్షణ కోసం నాణ్యమైన సన్ గ్లాసెస్ ఉపయోగించాలి.
గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలి. శరీరంలో నీరు తగ్గకుండా తరచూ మంచినీరు తాగాలి. నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
రాష్ట్రంలో ఎండల తీవ్రత ఇంకా కొన్ని రోజులు కొనసాగనున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వడగాల్పుల హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటేనే ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు. ప్రజల ప్రాణ భద్రత కోసం ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది.




