Hall Tickets : ఏపీ టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదల.. వాట్సాప్ మెసేజ్‌తో డౌన్‌లోడ్ చేసుకోండిలా

Hall Tickets : ఏపీ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. మే 25 నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షల హాల్‌టికెట్లను వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే వెలుసుబాటు ఉంది.

CR Reddy
Published on: 19 May 2026 8:17 AM IST
Hall Tickets
X

Hall Tickets

Hall Tickets : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు విద్యాశాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను అధికారికంగా విడుదల చేసింది. మే 25వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని స్కూళ్ల లాగిన్‌లలో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచామని, విద్యార్థులు తమ పాఠశాలలకు వెళ్లి వీటిని తీసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డాక్టర్ కేవీ శ్రీనివాసులు రెడ్డి స్పష్టం చేశారు.

వాట్సాప్‌లోనే హాల్‌టికెట్..

ఈసారి విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం సరికొత్త ఏర్పాట్లు చేసింది. నెట్ సెంటర్ల చుట్టూ తిరిగే పని లేకుండా నేరుగా మొబైల్‌లోనే హాల్‌టికెట్ పొందేలా మనమిత్ర వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు 95523 00009 నంబర్‌కు వాట్సాప్‌లో మెసేజ్ చేయడం ద్వారా నేరుగా తమ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSEAP) అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా హాల్‌టికెట్లను ప్రింట్ తీసుకోవచ్చు. ఇందుకోసం విద్యార్థులు మార్చి 2026 నాటి పాత రోల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

ఏపీ టెన్త్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటే?

ఈ ఏడాది విడుదలైన ఏపీ టెన్త్ క్లాస్ రెగ్యులర్ ఫలితాల్లో మొత్తం 85.25 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం 4 శాతం పెరగడం విశేషం. ఎప్పటిలాగే ఈసారి కూడా అమ్మాయిలే పైచేయి సాధించారు. బాలికలు 87.90 శాతం మంది పాస్ కాగా, బాలురు 82.68 శాతంతో సరిపెట్టుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మారాయని, గతేడాది 72.8 శాతంగా ఉన్న సర్కారు బడుల ఉత్తీర్ణత ఈసారి ఏకంగా 78.39 శాతానికి పెరిగిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు.

ఓపెన్ టెన్త్, ఇంటర్ ఫలితాలు కూడా రెడీ

రెగ్యులర్ విద్యార్థులతో పాటు ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించిన పదో తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ పరీక్షల ఫలితాలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఓపెన్ స్కూల్ ఫలితాలను విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ apopenschool.ap.gov.in లో చూసుకోవచ్చని మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. వీటిని కూడా పైన పేర్కొన్న మన మిత్ర వాట్సాప్ నెంబర్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు. ఫెయిలైన విద్యార్థులు నిరాశ పడకుండా ఈ సప్లిమెంటరీ పరీక్షలను అందిపుచ్చుకోవాలని విద్యాశాఖ సూచించింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story