Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈదురుగాలులతో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Weather Update
Weather Update: వాయువ్య బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో బలమైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా ప్రాంతాలతో పాటు రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. పలు జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు చెట్ల కింద నిలబడవద్దని అధికారులు సూచించారు. సముద్ర తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
తెలంగాణలో ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో జాగ్రత్త
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణలోనూ వర్ష ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ, జనగామ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉంద ని తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే వీలుండటంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
రైతులకు, ప్రజలకు అత్యవసర సూచనలు
వర్షం పడే సమయంలో వాహనదారులు, ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, గొర్రెల కాపరులు వర్షం వచ్చే సూచనలు కనిపిస్తే చెట్లు, కరెంట్ స్తంభాల కింద ఆశ్రయం పొందకూడదని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో మారుతున్న వాతావరణ పరిణామాల వల్ల ఈ వర్షాలు మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ఇచ్చే అధికారిక సమాచారాన్ని గమనిస్తూ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.




