Weather Update : మధ్యాహ్నం ఎండ.. సాయంత్రం వడగండ్ల వాన.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఐఎండీ అలెర్ట్
Weather Update : ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి.. అదే సమయంలో అకాల వర్షాలు భయపెడుతున్నాయి. గూడూరులో 45.8 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత నమోదైంది.
Weather Update
Weather Update : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం విచిత్రంగా మారుతోంది. ఒకవైపు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ నిప్పులు చెరుగుతుంటే, మరోవైపు అకాల వర్షాలు, పిడుగులు ప్రజలను భయపెడుతున్నాయి. అటు ఎండల తీవ్రత, ఇటు ఉరుములు, మెరుపులతో కూడిన వానలతో ఒక విభిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాబోయే రెండు, మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
నిప్పుల కొలిమిలా మారిన రాష్ట్రం
ఆంధ్రప్రదేశ్లో ఎండలు మునుపెన్నడూ లేని విధంగా ముదురుతున్నాయి. నెల్లూరు జిల్లా గూడూరులో గురువారం అత్యధికంగా 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది ఈ సీజన్లో ఇప్పటి వరకు రికార్డు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 45.2, మార్కాపురం ప్రాంతంలో 45 డిగ్రీల సెగలు కనిపించాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 216 మండలాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు దాటిపోయాయి. పార్వతీపురం మన్యం, పోలవరం వంటి జిల్లాల్లో తీవ్రమైన వేడి గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.
అకాల వర్షాలు.. వడగండ్ల వానలు
ఎండలు మండిపోతున్నప్పటికీ, ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. తిరుమల పుణ్యక్షేత్రంతో పాటు ఎన్టీఆర్ జిల్లాలో గురువారం సాయంత్రం వడగండ్ల వాన కురిసి ప్రజలను ఆశ్చర్యపరిచింది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం వంటి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
ప్రజలకు, రైతులకు కీలక సూచనలు
వాతావరణంలో చోటు చేసుకుంటున్న ఈ అనూహ్య మార్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని కోరారు. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర ఉండవద్దని హెచ్చరించారు. రైతులు, కూలీలు పొలం పనుల్లో ఉన్నప్పుడు వాతావరణం మారగానే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలిపారు.
తెలంగాణలోనూ ఇదే పరిస్థితి
కేవలం ఏపీలోనే కాకుండా తెలంగాణలో కూడా రాబోయే మూడు రోజుల పాటు వర్ష సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు లేకపోయినా, అప్పుడప్పుడు కురిసే జల్లుల వల్ల ఉక్కపోత పెరిగే అవకాశం ఉంది. దక్షిణ కర్ణాటక నుంచి తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ వింత వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.




