Vizag: ఏయూ శతాబ్ది వేడుకలకు ముస్తాబు.. ముఖ్య అతిథిగా క్రికెట్ గాడ్
Vizag: విశాఖపట్టణంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ (AU) శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను ఈ నెల 27న అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు.
Vizag: ఏయూ శతాబ్ది వేడుకలకు ముస్తాబు.. ముఖ్య అతిథిగా క్రికెట్ గాడ్
Vizag: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల నిర్వహణకు సమగ్ర ఏర్పాట్లు చేయాలని, విజయవంతం చేసేందుకు ప్రణాళికాయుత చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ పేర్కొన్నారు. ఈ నెల 27న జరగనున్న శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల నిర్వహణపై ఏయూ వీసీ జి.పి. రాజశేఖర్, జేసీ గొబ్బిళ్ల విద్యాధరిలతో కలిసి జిల్లా అధికారులు,
యూనివర్సిటీ అధికారులతో శుక్రవారం ఏయూ సెనేట్ హాలులో సంయుక్త సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. వర్చ్యువల్ గా పాల్గొన్న రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ భరత్ గుప్తా పలు అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. చెక్ లిస్టు ప్రకారం అన్ని ఏర్పాట్లూ చేసుకోవాలని సూచించారు.
ఈ క్రమంలో ముందుగా ఏయూ తరఫున చేయబోయే కార్యక్రమాలను, ప్రాథమిక ప్రణాళికలను వీసీ జీజీ రాజశేఖర్ వివరించారు. ముగింపు వేడుకులను ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించడానికి నిర్ణయించామని, సుమారు 25 వేల మంది భాగస్వామ్యం కానున్నారని, ఆ రోజు మధ్యాహ్నం 4.00 గంటల నుంచి కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. దీనికి సంబంధించిన ఇన్ఛార్జి అధికారులను నియమించామని చెప్పారు. ఉప రాష్ట్రపతి, సచిన్ తెండూల్కర్ ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారని తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ మాట్లాడుతూ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు రెండు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అడ్వైజరీ (సలహా) కమిటీలో యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు సభ్యులుగా ఉంటారని, వర్కింగ్ (నిర్వహణ) కమిటీ జిల్లా యంత్రాంగం, యూనివర్సిటీ అధ్యాపకులతో సమన్వయంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ముగింపు వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి, రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్, ఉప ముఖ్యమంత్రి, ఐటీ శాఖ మంత్రి, సచిన్ తెండూల్కర్ హాజరుకానున్న నేపథ్యంలో ప్రోటోకాల్, భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులకు చెప్పారు.
వివిఐపీల రాక, బస, భద్రత అంశాల్లో ఎటువంటి లోపాలు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, సాధారణ పౌరులు మధ్యాహ్నం 2:00 గంటలకే తమకు కేటాయించిన స్థానాల్లో కూర్చునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వీవీఐపీలు వచ్చే లోపు విద్యార్థుల కోసం ప్రత్యేక సైడ్ స్టేజ్పై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం 100 సంవత్సరాల చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ శతాబ్ది ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా కలెక్టర్ గుర్తు చేశారు.
వేదిక ఇన్ఛార్జులు, గ్రీన్ రూమ్ ఇన్ఛార్జి అధికారులు చాలా జాగ్రత్తగా ఉండాలని, చెక్ లిస్టు ప్రకారం అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన మినిట్ టు మినిట్ షెడ్యూల్ తయారు చేయాలని జేసీకి చెప్పారు. ప్రధాన వేదిక, గ్యాలరీలు, సీటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్యాలరీల్లోనే కాకుండా ప్రధాన వేదిక పరిసరాల్లో, బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ హాలులో, బీచ్ రోడ్లో ప్రత్యేక ఎల్.ఈ.డి. స్క్రీన్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
పార్కింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, వెహికల్ పాసులు, ఇతర పాసుల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎలక్ట్రికల్ సేఫ్టీ, వైద్య పరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఆధునిక సదుపాయాలు కలిగిన అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. ప్రతి అంశంపైనా సునిశిత పరిశీలన ఉండాలని, సూక్ష్మ స్థాయి అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రణాళికలు సిద్ధం చేయాలని, భద్రతా పరమైన ఏర్పాట్లు పటిష్టంగా ఉండేలా చూసుకోవాలని చెప్పారు. జిల్లా యంత్రాంగం, ఏయూ అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు.




