Chinta Mohan: జయలలితకు ఒక న్యాయం.. జగన్కు ఒక న్యాయమా?
Chinta Mohan: ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో వైఎస్ జగన్ వ్యవహారంపై దర్యాప్తు సంస్థల తీరును తప్పుబట్టారు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్.
Chinta Mohan: జయలలితకు ఒక న్యాయం.. జగన్కు ఒక న్యాయమా?
Chinta Mohan: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత తన పదవికి అనర్హురాలయ్యారని, కానీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో మాత్రం దర్యాప్తు సంస్థలు ఎటూ తేల్చడం లేదని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం నెల్లూరు, కావలి ప్రెస్క్లబ్లలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర ప్రభుత్వ తీరుపై, ఏపీ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
సుప్రీంకోర్టులో వైఎస్ జగన్పై ఇప్పటికీ 11 కేసులు అపరిష్కృతంగానే ఉన్నాయని చింతా మోహన్ గుర్తు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) లడ్డూ వివాదంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) చేత విచారణ జరిపించిన కేంద్రం.. అదే తరహాలో అయోధ్య రామమందిర నిర్మాణంలో పెద్ద ఎత్తున నిధులు కాజేసిన వైనంపై ఎందుకు విచారణ జరిపించడం లేదని ఆయన ప్రశ్నించారు.
పాలస్తీనాలోని గాజాపై జరిగిన దాడుల్లో సుమారు 20 వేల మంది అమాయక చిన్నారులు మరణించారని, ఈ మారణహోమాన్ని ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో ఖండించాయని చింతా మోహన్ పేర్కొన్నారు. అయితే, అమెరికా అండతో సాగుతున్న ఈ మారణకాండపై భారత ప్రభుత్వం కనీస స్పందన కూడా తెలపకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ మిత్రుడైన ప్రముఖ వ్యాపారవేత్త అదానీ గతంలో అమెరికాలో అనేక వివాదాస్పద తప్పులు చేశారని, ఆ కేసుల ప్రభావం తమపై పడకుండా ఉండేందుకే, మోదీ ప్రభుత్వం గాజాలో మరణించిన చిన్నారులకు కనీసం సంతాప ప్రకటన కూడా చేయలేదని ఆయన ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం ప్రచారానికే పరిమితమయ్యారని చింతా మోహన్ మండిపడ్డారు. రాష్ట్రంలో నిరంతరం ప్రచారం చేసుకోవడం మినహా, క్షేత్రస్థాయిలో ఎక్కడా అభివృద్ధి ఊసే లేదని ఆయన విమర్శించారు.




