Balineni Srinivasa Reddy: నన్ను ఓడించింది వైసీపీ వాళ్లే.. బాలినేని సంచలన వ్యాఖ్యలు..
Balineni Srinivasa Reddy: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒంగోలులో తన ఓటమికి సొంత పార్టీ వారే కారణమని, జనసేనలో ఉన్నా తనపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
Balineni Srinivasa Reddy: నన్ను ఓడించింది వైసీపీ వాళ్లే.. బాలినేని సంచలన వ్యాఖ్యలు..
Balineni Srinivasa Reddy: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై మరోసారి నిప్పులు చెరిగారు. వైసీపీలో తనను అన్ని విధాలుగా అణచివేశారని, ఆ పార్టీ వల్ల తాను భారీగా నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలులో జరిగిన తాజా సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
"ఒంగోలులో నన్ను ఓడించింది జనసేన లేదా టీడీపీ వాళ్లు కాదు.. వైసీపీలోని వారే నన్ను వెన్నుపోటు పొడిచారు" అని బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఉప ఎన్నికల సమయంలో వైసీపీ వల్ల తాను ఏకంగా రూ. 22 కోట్లు నష్టపోయానని వెల్లడించారు. ప్రశ్నించే గొంతుక ఉన్న పార్టీలో ఉండాలనే ఉద్దేశంతోనే తాను జనసేనలో చేరానని స్పష్టం చేశారు.
తాను జనసేనలో ఉన్నప్పటికీ వైసీపీ నేతలు కావాలనే తనను టార్గెట్ చేస్తున్నారని బాలినేని మండిపడ్డారు. తాను తిరిగి వైసీపీలోకి వస్తానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కానీ తాను చచ్చినా ఆ పార్టీ వైపు చూడనని తేల్చి చెప్పారు. "ఎవరు ఎన్ని మాట్లాడినా నేను పవన్ కళ్యాణ్ వెంటే ఉంటాను. అవకాశం ఇస్తే పవన్ కళ్యాణ్తో సినిమా తీయడానికి కూడా నేను సిద్ధం" అని తన అభిమానాన్ని చాటుకున్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై బాలినేని అప్పుడే కసరత్తు ప్రారంభించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రోజే సమావేశం నిర్వహించాలని అనుచరులకు సూచించారు. వార్డు రిజర్వేషన్ సీట్లను జనసేన పార్టీకి కన్ఫామ్ చేసుకునేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. వైసీపీలో అవమానాలు భరించలేకే బయటకు వచ్చానని, ఇప్పుడు జనసేనలో స్వేచ్ఛగా పనిచేసుకుంటున్నానని బాలినేని పేర్కొన్నారు.




