Weather Update : ఆ సమయాల్లో బయటకు రావొద్దు.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక
Weather Update : ఏపీ, తెలంగాణలో ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు బయటకు రావొద్దని సూచించింది.
Weather Update
Weather Update : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భానుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. ఏప్రిల్ నెలలోనే ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటడంతో జనం అల్లాడిపోతున్నారు. దీనికి తోడు వడగాల్పులు తోడవ్వడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో బయటకు రావొద్దని, వస్తే ప్రాణాపాయం పొంచి ఉందని హెచ్చరించింది.
ఏపీలో నిప్పుల కొలిమి
ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత అంచనాలకు మించి పెరుగుతోంది. ఉదయం 8 గంటలకే ఎండ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. మధ్యాహ్నం అయ్యేసరికి ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుతున్నాయి. ఏప్రిల్ 14న రాయలసీమ, కోస్తా జిల్లాల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కడపలో ఇప్పటికే 44.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవ్వగా, నంద్యాల జిల్లా సంజామలలో 44 డిగ్రీలు, పల్నాడు జిల్లా దుర్గిలో 42.8 డిగ్రీలుగా నమోదైంది. ఇవన్నీ ఈ సీజన్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలుగా చెబుతున్నారు.
తీవ్ర వడగాల్పుల హెచ్చరిక
రాష్ట్రంలోని సుమారు 33 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని, మరో 44 మండలాల్లో సాధారణ వడగాల్పులు ఉంటాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా ఉంది. పార్వతీపురం మన్యంలో ఏకంగా 15 మండలాలు తీవ్ర వడగాల్పుల గుప్పిట్లో ఉన్నాయి. శ్రీకాకుళంలో 4, విజయనగరంలో 9 మండలాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. వేడి గాలుల వల్ల శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారుతోందని జనం వాపోతున్నారు.
తెలంగాణలోనూ అదే పరిస్థితి
తెలంగాణలో కూడా పరిస్థితి ఏమీ మెరుగ్గా లేదు. రానున్న వారం రోజుల పాటు హీట్ వేవ్ (వడగాల్పులు) కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉష్ణోగ్రతలు మరో 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. సోమవారం ఒక్క రోజే వడదెబ్బ కారణంగా రాష్ట్రంలో నలుగురు మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది. నిజామాబాద్లో 43.2 డిగ్రీలు, హైదరాబాద్లో 40 డిగ్రీల మార్కును దాటేసింది. నగరాల్లో మధ్యాహ్నం వేళ రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఎండల నుంచి ప్రాణాలను కాపాడుకోవడానికి విపత్తు నిర్వహణ సంస్థ పలు సూచనలు చేసింది. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే కచ్చితంగా గొడుగు వాడటం లేదా తలకు టోపీ, రుమాలు ధరించడం తప్పనిసరి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి గంటకోసారి నీళ్లు తాగాలని, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి పానీయాలు తీసుకోవాలని సూచించింది. చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు ఎండ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.




