Weather Update : తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం.. ఒకవైపు నిప్పుల కొలిమి, మరోవైపు పిడుగుల బీభత్సం
Weather Update : తెలుగు రాష్ట్రాల్లో రాబోయే ఐదు రోజులు వాతావరణం అత్యంత ప్రమాదకరంగా మారనుంది. ఏపీలో 48 డిగ్రీల ఎండలు, తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
Weather Update
Weather Update : తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ కేంద్రం అత్యంత కీలకమైన హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వాతావరణం ఎవరూ ఊహించని విధంగా చాలా వింతగా మారబోతోంది. ఒకవైపు కొన్ని జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో భానుడు భగభగలాడుతూ తీవ్రమైన వడగాల్పులు సృష్టించబోతుంటే, అదే సమయంలో మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ భిన్నమైన పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ప్రత్యేక సూచనలు చేసింది.
చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు
దేశ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాల గమనం ప్రస్తుతం చాలా చురుగ్గా సాగుతోంది. ఐఎండీ నివేదికల ప్రకారం, రుతుపవనాల ఉత్తర పరిమితి ఆగ్నేయ అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల మీదుగా ముందుకు సాగుతోంది. రాబోయే రెండు మూడు రోజుల్లో ఇవి అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలతో పాటు మధ్య బంగాళాఖాతంలోకి మరింత విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. దీనివల్ల జూన్ మొదటి వారంలోనే తెలుగు రాష్ట్రాల్లోకి వర్షాలు ప్రవేశించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఏపీలో 48 డిగ్రీల రికార్డు స్థాయి ఎండలు
ఆంధ్రప్రదేశ్లో మే 23 (శనివారం) నుండి మే 26 వరకు ఎండల తీవ్రత పీక్ స్టేజ్కు చేరనుంది. కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాలలో ఊపిరి ఆడనివ్వని రీతిలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా ప్రకారం శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 221 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీయనున్నాయి. పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఊహించని విధంగా 46 డిగ్రీల నుండి 48 డిగ్రీల వరకు నమోదయ్యే ప్రమాదం ఉంది. అలాగే అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో 43 నుండి 45 డిగ్రీలు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, రాయలసీమ జిల్లాల్లో 41 నుంచి 43 డిగ్రీల వరకు ఎండలు మండిపోనున్నాయి.
రాయలసీమకు పిడుగుల ముప్పు
ఒకవైపు కోస్తాంధ్రలో ఎండలు ముదురుతున్న తరుణంలోనే, రాయలసీమ పరిధిలోని జిల్లాలకు వాతావరణ శాఖ మరో ముప్పును పొంచి ఉందని హెచ్చరించింది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, బలమైన మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే మార్పుల వల్ల కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు.
తెలంగాణలో మూడు రోజుల పాటు విచిత్ర సీన్
తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబోయే మూడు రోజుల పాటు వాతావరణం అత్యంత భిన్నంగా మారనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మే 23 ఉదయం నుండి మే 24 ఉదయం వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
ఉత్తర, తూర్పు తెలంగాణలో నిప్పుల కొలిమి
ఇదే సమయంలో తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో ఎండల తీవ్రత విపరీతంగా పెరగనుంది. మే 23 నుండి 24 వరకు ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలలో అక్కడక్కడ తీవ్రమైన వడగాల్పులు వీచే పరిస్థితులు ఉన్నాయి.
ఆ తర్వాత మే 24 నుంచి మే 28 వరకు తెలంగాణవ్యాప్తంగా వర్షాలు తగ్గి, పొడి వాతావరణం ఏర్పడనుంది. అయితే ఎండల తీవ్రత మాత్రం తగ్గదని, వడగాల్పులు మరికొన్ని రోజులు కొనసాగుతాయని స్పష్టమవుతోంది. ముఖ్యంగా కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, మంచిర్యాల ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, మధ్యాహ్నం 12 గంటల నుండి 4 గంటల వరకు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.




