భూ సమస్యల పరిష్కారానికి అధికారుల ప్రత్యేక చొరవ ఉండాలి: జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు ఆదేశం!
కొమరోలు, రాచర్ల, అర్ధవీడు మండలాల్లో జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు పర్యటించారు. రీ-సర్వే సమస్యలను ఈ నెలాఖరులోపు పరిష్కరించాలని, రైతులకు కొత్త పాస్ పుస్తకాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు.
గిద్దలూరు/మార్కాపురం: కొమరోలు, రాచర్ల, అర్ధవీడు. మండలాల్లో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఒక నెల- ఒక గ్రామం- నాలుగు సందర్శనలు కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన కొమరోలు మండలంలోని సూరవారి పల్లి, రాచర్ల మండలంలోని అనుమలపల్లి, అర్ధవీడు మండలంలోని బొల్లుపల్లి గ్రామాల్లో రెవెన్యూ అధికారులు నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీ సర్వే జరిగిన గ్రామాల్లో జాయింట్ ఎల్ పీ ఎం సమస్యలను ఈ నెలాఖరు లోపు పరిష్కారం చేయాలన్నారు. సాదా, బైనమా, చేతిరాతలు ద్వారా రాసుకున్న వాటికి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 206 గ్రామాలు రీ సర్వే పూర్తి అయిందని వివరించారు. వీటిల్లో అందరికీ నూతన పాస్ పుస్తకాలు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో భూ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఎంతైనా ఉందన్నారు. మార్కాపురం జిల్లాలో ఎక్కువగా ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాలు తహసిల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.




