Anam Ramanarayana Reddy: నాడు రథాల దహనం, సింహాల మాయం.. కూటమి ప్రభుత్వంలోనే ఆలయాలకు పూర్వవైభవం

Anam Ramanarayana Reddy: కూటమి ప్రభుత్వంలో దేవాదాయ ధర్మదాయ శాఖ రెండేళ్ల పరిపాలన నమ్మకం, సుపరిపాలనతో సాగిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.

Arun Chilukuri
Published on: 22 Jun 2026 12:05 PM IST
Anam Ramanarayana Reddy
X

Anam Ramanarayana Reddy: నాడు రథాల దహనం, సింహాల మాయం.. కూటమి ప్రభుత్వంలోనే ఆలయాలకు పూర్వవైభవం

Anam Ramanarayana Reddy: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా.. దేవాదాయ ధర్మదాయ శాఖలో సాధించిన పురోగతి, ప్రక్షాళనపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తిరుపతి వేదికగా కీలక వివరాలను వెల్లడించారు. కూటమి ప్రభుత్వంలో దేవాదాయ శాఖ పరిపాలన నమ్మకం, సుపరిపాలన ఆధారంగా సాగిందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు అన్ని వివరాలు తెలియజేసి పరిపాలనను మరింత వేగవంతం చేయడమే సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ప్రభుత్వం తరఫున ప్రజలకు ఏమేమి హామీలు ఇచ్చాం.. వాటిని ఎలా నిలబెట్టుకుంటున్నాం అనే విషయాలను ప్రజలకు వివరించేందుకే ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. తిరుపతిలో ప్రారంభమైన ఈ ప్రగతి నివేదికల కార్యక్రమం.. రాబోయే రోజుల్లో అన్ని జిల్లాలలో స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడుతుందని వెల్లడించారు.

2019-24 మధ్య కాలంలో రాష్ట్రంలో ఒక విచ్ఛిన్నకరమైన వాతావరణం నెలకొందని మంత్రి ఆనం తీవ్ర విమర్శలు చేశారు. దేవుళ్లను పూజించే భక్తులకు కనీస ఆదరణ, రక్షణ లేని పరిస్థితి నాడు ఉండేది. అంతర్వేదిలో రథం కాలిపోవడం, విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో వెండి సింహాలు మాయమవ్వడం, వెలుగోటి క్షేత్రంలో రథం దహనం కావడం లాంటి విచిత్రమైన, దారుణమైన సంఘటనలు గత ప్రభుత్వ హయాంలో జరిగాయి. హిందూ భక్తులు ఆలయాలకు వెళ్లి సేవ చేసుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు.

గత ప్రభుత్వ విధ్వంసం నుంచి మెరుగైనటువంటి దైవ శక్తిని భక్తులకు అందించే ఆలోచనతో సీఎం చంద్రబాబు అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి ఆనం కొనియాడారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఆలయాలన్నింటిలో ప్రక్షాళన వాతావరణం తీసుకొచ్చామని.. భక్తుల విశ్వాసం, ఆధ్యాత్మిక చింతనతో దేవాదాయ శాఖను సరికొత్త పంథాలో ముందుకు నడిపిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story