Razole: రాజోలులో ప్రజా సమస్యల పరిష్కారానికి వినూత్న అడుగు

Razole: రాజోలు మండలం చింతలపల్లి గ్రామంలో ‘వన్ మంత్ – వన్ విలేజ్ – ఫోర్ విజిట్స్’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రారంభించారు.

PRABHU, RAZOLE
Published on: 22 May 2026 4:41 PM IST
Razole
X

Razole: రాజోలులో ప్రజా సమస్యల పరిష్కారానికి వినూత్న అడుగు

రాజోలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “One Month – One Village – Four Visits” కార్యక్రమం నేడు రాజోలు మండలం చింతలపల్లి గ్రామంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.., గ్రామీణ ప్రజల సమస్యలను వారి గ్రామాల్లోనే గుర్తించి వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని తమ భూ సంబంధిత, రెవెన్యూ, సంక్షేమ పథకాలు మరియు ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.

ప్రత్యేకంగా భూ యాజమాన్యానికి సంబంధించిన సమస్యల వల్ల ఆస్తుల కొనుగోలు, విక్రయాల సమయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. భూములు తమ పేర్లలో నమోదు కాకపోవడం, రికార్డుల్లో లోపాలు ఉండటం వంటి సమస్యలను ఈ కార్యక్రమం ద్వారా సరిదిద్దుకునే అవకాశం కల్పించబడిందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వివిధ శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని, నాలుగు వారాల వ్యవధిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటికి సత్వర పరిష్కారం అందించే విధంగా చర్యలు తీసుకుంటారని తెలిపారు. ప్రతి కుటుంబం ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యలను నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story