Nallamada: మండుటెండలో విద్యార్థుల ర్యాలీ.. అధికారుల అత్యుత్సాహం!

Nallamada: శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడలో తీవ్రమైన ఎండలో విద్యార్థులతో 'స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర' ర్యాలీ నిర్వహించడం వివాదాస్పదమైంది.

S.Firoz, Sri Sathya Sai
Published on: 18 April 2026 4:58 PM IST
Nallamada
X

Nallamada: మండుటెండలో విద్యార్థుల ర్యాలీ.. అధికారుల అత్యుత్సాహం!

Nallamada: శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండల కేంద్రంలో మండుటెండను లెక్కచేయకుండా విద్యార్థులతో నిర్వహించిన “స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర” అవగాహన ర్యాలీ వివాదాస్పదంగా మారింది. సుమారు ఒక కిలోమీటర్ మేర ఈ ర్యాలీ కొనసాగగా, అనంతరం బస్టాండ్ కూడలిలో అరగంటకు పైగా విద్యార్థులతో మానవహారం ఏర్పాటు చేశారు.

అయితే, తీవ్ర ఎండలో ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది విద్యార్థులు చెప్పులు లేకుండానే ర్యాలీలో పాల్గొనాల్సి రావడంతో, వేడెక్కిన రహదారిపై నడుస్తూ కాళ్లు మండిపోయిన పరిస్థితి కనిపించింది. ఎండ తీవ్రతను తట్టుకోలేక విద్యార్థినులు ఇబ్బందులు పడ్డారు. ర్యాలీకి హాజరు కాకపోతే సమస్యలు వస్తాయనే భయంతో విద్యార్థులు తప్పనిసరిగా పాల్గొనాల్సి వచ్చిందని సమాచారం.

ఈ నేపథ్యంలో అధికారుల అత్యుత్సాహం విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే సమయంలో వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

S.Firoz, Sri Sathya Sai

S.Firoz, Sri Sathya Sai

Next Story