Nara Lokesh: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి: అసెంబ్లీలో మంత్రి లోకేశ్!
Nara Lokesh: శాసనసభ వర్షాకాల సమావేశాల్లో మెగా డీఎస్సీపై మాట్లాడిన మంత్రి నారా లోకేశ్.
Nara Lokesh: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి: అసెంబ్లీలో మంత్రి లోకేశ్!
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాల సందర్భంగా మంత్రి నారా లోకేశ్ డీఎస్సీ నియామకాలు, విద్యా రంగంలో తీసుకొచ్చిన మార్పులపై కీలక ప్రసంగం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ నిర్వహణను ఎంతో బాధ్యతగా తీసుకుని, కేవలం 148 రోజుల్లోనే నియామకాల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామని స్పష్టం చేశారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ప్రభుత్వం పని చేస్తోందని, ప్రతి ఏటా పారదర్శకంగా డీఎస్సీని నిర్వహిస్తామని మంత్రి పునరుద్ఘాటించారు. టీచర్ల నియామకాలు, బదిలీల ప్రక్రియలో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకత ఉండాలన్నది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్ష అని తెలిపారు.
తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలో ఇప్పటివరకూ మొత్తంగా 1.80 లక్షల టీచర్ పోస్టులను భర్తీ చేసిన ఘనత తమదేనని మంత్రి లోకేశ్ గుర్తుచేశారు. ఉపాధ్యాయుల నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ తమ ప్రభుత్వం టీచర్లను సింగపూర్, ఫిన్లాండ్ వంటి విదేశాలకు పంపి శిక్షణ ఇప్పించిందని అన్నారు.
గత వైకాపా ప్రభుత్వ పాలనపై మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద సెక్యూరిటీగా నిలబెట్టి వారి గౌరవాన్ని దిగజార్చారు. కానీ మా కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ విద్యావ్యవస్థ బలోపేతానికి విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తోంది" అని స్పష్టం చేశారు.




