Nara Lokesh: బడ్జెట్ కొరత ఉన్నా మంగళగిరి అభివృద్ధి ఆగదు
Nara Lokesh: బడ్జెట్ కొరత ఉన్నా మంగళగిరిలో అభివృద్ధి ఆగదని మంత్రి నారా లోకేశ్ అన్నారు.
Nara Lokesh: బడ్జెట్ కొరత ఉన్నా మంగళగిరి అభివృద్ధి ఆగదు
Nara Lokesh: రాష్ట్రానికి బడ్జెట్ కొరత ఉన్నప్పటికీ మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎక్కడా ఆగడం లేదని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ నిధులతో ఇబ్బంది ఎదురైతే సీఎస్ఆర్ (CSR) నిధులు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పనులు పూర్తి చేస్తున్నామని వెల్లడించారు. మంగళగిరి నియోజకవర్గంలో ‘మన ఇల్లు.. మన లోకేశ్’ పేరిట నిర్వహించిన రెండో రోజు కార్యక్రమంలో మంత్రి పాల్గొని పేదలకు ఇళ్ల పట్టాలను అందజేశారు. గత రెండు రోజుల్లోనే ఏకంగా 3,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.
దశాబ్దాలుగా కొండవాలు ప్రాంతాలు, అటవీ భూములు, దేవాలయ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేదలకు ఎక్కడా ఎలాంటి ఆరోపణలు లేకుండా పూర్తి పారదర్శకంగా పట్టాలిచ్చారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలు, పసుపు కుంకుమలు సమర్పించి పండగ వాతావరణంలో పట్టాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. "దేశమంతా నిడమర్రు పాఠశాల గురించి గొప్పగా మాట్లాడుకోవడం గర్వకారణంగా ఉంది. ఇంటి పట్టాలతో పాటు భూగర్భ డ్రైనేజీ, 100 పడకల ఆసుపత్రి నిర్మాణం, నీటి సమస్య వంటి కీలక అంశాలకు రెండేళ్లలోనే పరిష్కారం చూపిస్తున్నాం" అని తెలిపారు.
గతంలో మంగళగిరి ప్రజలు తనను ఓడించినా, ఆ కసితోనే నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి మరింత ఎక్కువగా పనిచేశానని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సొంత నిధులతో 29 సంక్షేమ పథకాలను అమలు చేసి చూపించానని, అధికారం ఇస్తే ఇంకా ఎంత మేలు చేస్తానో నిరూపిస్తున్నానని లోకేశ్ పేర్కొన్నారు.




