Rayadurgam: మహిళా భద్రతపై అవగాహన సదస్సు.. 'శక్తి యాప్' పై వివరణ
Rayadurgam: రాయదుర్గం పట్టణంలో మహిళలు, బాలికల భద్రతపై ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Rayadurgam: మహిళా భద్రతపై అవగాహన సదస్సు.. 'శక్తి యాప్' పై వివరణ
Rayadurgam: రాయదుర్గం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణమండపంలో మహిళలు, బాలికల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ జగదీష్ ఐపీఎస్ ఆదేశాల మేరకు డీఎస్పీ రవిబాబు సమక్షంలో సీఐ జయా నాయక్ సిబ్బందితో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, మెప్మా సిబ్బంది, అంగన్వాడీ, ఆశ వర్కర్లు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మహిళలు, బాలికలు ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా ధైర్యంగా, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా లేదా వేధింపులకు గురిచేసినా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హోం మంత్రి వంగలపూడి అనిత నాయకత్వంలో మహిళల రక్షణ కోసం “శక్తి యాప్” ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ యాప్లో బటన్ నొక్కగానే పోలీసులు తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను రక్షిస్తారని వివరించారు.
అలాగే మహిళలు వేధింపులకు గురైనప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తే నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మహిళా రక్షణ ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని తెలిపారు. చట్టసభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవిబాబు, శక్తి టీం డీఎస్పీ మహబూబ్ బాషా పాల్గొన్నారు. మహిళా భద్రతను ప్రధాన కర్తవ్యంగా తీసుకుని పోలీసులు చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.




