Weather Update : ఎండల తీవ్రతకు రెండు రోజుల్లోనే 40 మంది మృతి.. రాబోయే ఐదు రోజులు జాగ్రత్త
Weather Update : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ముంచెత్తుతున్నాయి. తీవ్ర వడగాలుల కారణంగా గత రెండు రోజుల్లోనే 40 మంది మృతి చెందగా, మరో 5 రోజుల పాటు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
Weather Update
Weather Update : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భానుడు తన ప్రచండ రూపాన్ని చూపిస్తున్నాడు. ఆకాశం నుంచి నిప్పులు కురుస్తున్నాయా అన్నట్లుగా ఎండల తీవ్రత పెరిగిపోవడంతో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత రెండు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బ కారణంగా దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఎండలతో పాటు వీస్తున్న వేడి గాలులు తోడవడంతో సామాన్య ప్రజలు, రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకునేవారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గాలిలో తేమ శాతం పూర్తిగా పడిపోవడం వల్లే ఈ స్థాయిలో వడదెబ్బ మరణాలు సంభవిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. పరిస్థితిని గమనించిన వాతావరణ శాఖ రాబోయే ఐదు రోజుల పాటు రెండు రాష్ట్రాల్లోనూ 'రెడ్ అలర్ట్' ప్రకటించి, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
తెలంగాణలో పెరుగుతున్న మరణాల సంఖ్య
తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత ఊహించని స్థాయికి చేరింది. గడిచిన రెండు రోజుల్లోనే ఇక్కడ దాదాపు 30 మంది వడదెబ్బతో మృతి చెందారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే రెండు రోజుల్లో 16 మంది ప్రాణాలు కోల్పోగా, గురువారం తొమ్మిది మంది, శుక్రవారం ఏడుగురు మరణించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాలకు వచ్చిన ఒక భక్తుడు కూడా ఎండ తాళలేక వడదెబ్బతో చనిపోయాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కూడా నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఇక్కడ వడగాలుల తాకిడికి 12 మంది మృతి చెందగా, జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. ఖమ్మం రూరల్ మండలం పల్లీగూడెంలో అత్యధికంగా 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కేవలం మనుషులే కాకుండా పశువులు కూడా ఈ వేడికి తట్టుకోలేక చనిపోతున్నాయి.
ఏపీలోనూ వడదెబ్బ సెగలు
ఆంధ్రప్రదేశ్ లోనూ ఎండల తీవ్రత ఘోరంగా ఉంది. విజయవాడ నగరంలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోనే వడదెబ్బ కారణంగా 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. మరణించిన వారిలో ఐదుగురు రోజువారీ కూలీలు, ప్రైవేట్ ఉద్యోగులు కాగా, మిగిలిన వారు యాచకులుగా గుర్తించారు. వన్టౌన్, గవర్నర్పేట, మాచవరం, న్యూ రాజేశ్వరీపేట పరిధిలో ఈ మరణాలు సంభవించాయి. నగరంలోని ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు, నీడ సౌకర్యాలు కల్పించినప్పటికీ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీనితో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం, విపత్తు నిర్వహణ శాఖ ప్రజలను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు
ఈ భయంకరమైన హీట్ వేవ్ తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదు రోజుల పాటు ఇలాగే కొనసాగుతుందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని కరీంనగర్, పెద్దపల్లి, సూర్యాపేట, నల్గొండ, హనుమకొండతో పాటు హైదరాబాద్ నగరానికి కూడా హెచ్చరికలు జారీ చేశారు. అటు ఏపీలోని పల్నాడు, నంద్యాల, కర్నూలు జిల్లాల యంత్రాంగాన్ని అధికారులు పూర్తిగా అప్రమత్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగినన్ని మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచాలని కలెక్టర్లు ఆదేశించారు. మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప వృద్ధులు, గర్భిణీలు, పిల్లలు బయటకు రావద్దని, ఎక్కువగా మజ్జిగ, నీరు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.




