Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల భేటీ.. థియేటర్ల సమస్యలపై కీలక చర్చ!

Pawan Kalyan: రాజమహేంద్రవరం పర్యటనలో ఉన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు మర్యాదపూర్వకంగా కలిశారు.

Arun Chilukuri
Published on: 26 May 2026 5:07 PM IST
Pawan Kalyan
X

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల భేటీ.. థియేటర్ల సమస్యలపై కీలక చర్చ!

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం (రాజమండ్రి) పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్‌తో మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ యెర్నేని, వై రవిశంకర్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ, సాహు గారపాటి, సతీష్ తదితర నిర్మాతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ, ముఖ్యంగా ఎగ్జిబిషన్ సెక్టార్ ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలను వారు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువచ్చారు.

సినీ పరిశ్రమకు వెన్నెముక లాంటి సింగిల్ స్క్రీన్ థియేటర్లు ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో నడుస్తున్నాయని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేశారు. థియేటర్ల యజమానులను ఆదుకునేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.

"ప్రస్తుతం మల్టీప్లెక్స్‌లలో ఉన్న విధానం తరహాలోనే.. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కూడా వచ్చిన లాభాల్లో నిర్మాతల నుంచి కొంత పర్సంటేజీ (రెవెన్యూ షేరింగ్) ఇచ్చేలా వీలు కల్పిస్తే థియేటర్లు నిలదొక్కుకుంటాయి. దీని కోసం ప్రభుత్వ పరంగా చొరవ తీసుకుని ఒక నిర్దిష్టమైన చట్టాన్ని లేదా పాలసీని రూపొందించాలి" అని నిర్మాతలు పవన్ కల్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు.

గత కొంతకాలంగా థియేటర్ల నిర్వహణ వ్యయం (మెయింటెనెన్స్ కాస్ట్) విపరీతంగా పెరిగిపోయిందని, ప్రతి నెలా వచ్చే కరెంట్ బిల్లులు, ఇతర ఖర్చులు భారంగా మారాయని నిర్మాతలు వివరించారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు విద్యుత్ ఛార్జీల్లో కొంత రాయితీ ఇస్తే, యజమానులపై భారం తగ్గి థియేటర్లు మూతపడకుండా ఉంటాయని వారు డిప్యూటీ సీఎంకు వివరించారు.

నిర్మాతలు చెప్పిన సమస్యలను ఎంతో ఓపికగా విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దీనిపై సానుకూలంగా స్పందించారు. చిత్ర పరిశ్రమకు ఎల్లప్పుడూ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, సమస్యల పరిష్కారానికి తగిన అడుగులు వేస్తామని అభయమిచ్చారు. నిర్మాతలు తమ ముందు ఉంచిన ప్రతిపాదనలు, సమస్యలను తక్షణమే పరిశీలించి తగిన నివేదిక సిద్ధం చేయాలని ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ను పవన్ కల్యాణ్ ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల టాలీవుడ్ నిర్మాతలు హర్షం వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story