Heavy Rains : అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.!

Heavy Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర రూపం దాల్చుతోంది. రాబోయే రెండు రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది..

G Krishna
Published on: 4 July 2026 12:44 PM IST
rain-alert
X

rain-alert

Heavy Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర రూపం దాల్చుతోంది. రాబోయే రెండు రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాగల కొన్ని రోజుల పాటు విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

తెలంగాణకు 'ఆరెంజ్ అలర్ట్'.. ఇవాళ, రేపు డేంజర్ జోన్..

ముఖ్యంగా తెలంగాణలోని ఉత్తర జిల్లాల్లో శని, ఆదివారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం.. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు తీవ్రతను సూచించే ‘ఆరెంజ్‌’ రంగు హెచ్చరికలు (Orange Alert) జారీ చేశారు.

వీటితో పాటు రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇక జూలై రెండో వారంలో (ఈ నెల 10 నుంచి 16 మధ్య) రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కన్నా అధికంగా వానలు పడతాయని, అంతకుముందు 3 నుంచి 9 వరకు సాధారణ స్థాయిలో వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ అల్పపీడన ప్రభావం బలంగా కనిపిస్తోంది. ఈరోజు అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ జిల్లాల పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని హెచ్చరించారు.

పిడుగులతో కూడిన వానలు.. ఈదురుగాలుల బీభత్సం

వర్షాలతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం పరివాహక ప్రాంతాలు, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకూడదని అధికారులు స్పష్టం చేశారు. అలాగే తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

మత్స్యకారులకు వేట నిషేధం.. ప్రజలకు అలర్ట్

సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున, మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తీర ప్రాంత ప్రజలు, నదీ పరివాహక ప్రాంతాల నివాసితులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే స్థానిక యంత్రాంగాన్ని అలర్ట్ చేసి, ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశాయి.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story