Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. రెండో ఘాట్ రోడ్డులో ఎలుగుబంటి ప్రత్యక్షం!
Tirumala: తిరుమలలో ఒకవైపు భక్తుల రద్దీ విపరీతంగా పెరగగా, మరోవైపు రెండో ఘాట్ రోడ్డులో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది.
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. రెండో ఘాట్ రోడ్డులో ఎలుగుబంటి ప్రత్యక్షం!
Tirumala: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. వరుస సెలవులు, వీకెండ్ (వారాంతం) కావడంతో దేశం నలుమూలల నుండి వచ్చిన భక్తులతో ఏడుకొండలు జనసంద్రంగా మారాయి. ఈ రద్దీ ఇలా ఉండగానే, తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ఎలుగుబంటి కలకలం రేపడం భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది.
పెరిగిన రద్దీపై తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తాజా వివరాలను వెల్లడించింది. రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం: 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. ఎస్ఎస్ డీ (SSD) టోకెన్లు ఉన్నవారు: దర్శనానికి ఇంచుమించు 5 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం (టోకెన్లు లేని భక్తులు): ఎలాంటి టోకెన్లు లేని సామాన్య భక్తులకు ఏకంగా 15 నుంచి 18 గంటల సుదీర్ఘ సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.
రద్దీ ఒకవైపు ఉంటే.. అడవిలోని జంతువులు తరచూ జనావాసాల్లోకి రావడం తిరుమలలో ఆందోళన కలిగిస్తోంది. తాజాగా తిరుమల రెండో ఘాట్ రోడ్డులోని వినాయక స్వామి ఆలయం సమీపంలో నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో ఒక ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. ఆహార అన్వేషణలో భాగంగా అది అడవి నుంచి రోడ్డుపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ఘాట్ రోడ్డులో వెళ్తున్న వాహనదారులు ఎలుగుబంటిని చూసి భయాందోళనతో కాసేపు వాహనాలను అక్కడే నిలిపివేశారు. కొందరు భక్తులు దీనికి సంబంధించిన దృశ్యాలను మొబైల్లో రికార్డ్ చేయగా, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
గతంలో ఇదే ప్రాంతంలో చిరుత పులి కూడా సంచరించినట్లు టీటీడీ సిబ్బంది గుర్తు చేస్తున్నారు. మెట్ల మార్గంలో భక్తులు తినుబండారాలు, వ్యర్థాలను పడేయడం వల్లే వన్యప్రాణులు అటవీ ప్రాంతం దాటి రోడ్లపైకి వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. హెచ్చరికలు జారీ చేసినా కొందరు భక్తులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విజిలెన్స్ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎలుగుబంటి సంచారంతో అప్రమత్తమైన సిబ్బంది.. భక్తులు ఎవరూ ఒంటరిగా వెళ్ళవద్దని, గుంపులు గుంపులుగా శ్రీవారి దర్శనానికి వెళ్ళాలని సూచించారు.




