Tirumala: తిరుమల భక్తులకు అలర్ట్.. 9 రోజుల పాటు ఆ సేవలన్నీ బంద్!
Tirumala: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల వేళ టీటీడీ కీలక నిర్ణయం. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు అన్ని ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు. సామాన్య భక్తుల దర్శనానికి ప్రాధాన్యత.
Tirumala: తిరుమల భక్తులకు అలర్ట్.. 9 రోజుల పాటు ఆ సేవలన్నీ బంద్!
Tirumala: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన విడుదల చేసింది. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజుల పాటు తిరుమలలో అన్ని రకాల ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ మంగళవారం స్పష్టం చేసింది. సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్న ఈ ఉత్సవాలకు కొండపైకి తరలివచ్చే సామాన్య భక్తులకు పెద్దపీట వేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
టీటీడీ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి ఆలయంలో జరిగే ప్రతిరోజూ మరియు వారపు ఆర్జిత సేవలను పూర్తిగా నిలిపివేయనున్నారు.
రద్దయిన ఆర్జిత సేవలు: అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ.
రద్దయిన ప్రత్యేక దర్శనాలు: వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐలు (NRI) మరియు దాతలకు ఇచ్చే ప్రాధాన్యతా ప్రత్యేక ప్రవేశ దర్శనాలు.
ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుమలకు పోటెత్తుతారు. ఈ విపరీతమైన రద్దీని దృష్టిలో ఉంచుకుని, గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వేగవంతమైన దర్శనం కల్పించేందుకే టీటీడీ ఈ మార్పులు చేపట్టింది.
తొమ్మిది రోజుల పాటు స్వామివారి ఉభయ దేవేరులతో కలిసి మాడ వీధుల్లో విహరించే వాహన సేవలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తులందరూ ఈ మార్పులను గమనించి టీటీడీకి సహకరించాలని ముఖ్య ప్రజా సంబంధాల అధికారి పత్రికా ప్రకటన ద్వారా కోరారు.




