Vande Bharat: గుడ్న్యూస్... విశాఖ టు బెంగళూరు...వందేభారత్ స్లీపర్ రెడీ?
ఆంధ్రప్రదేశ్కు వందేభారత్ స్లీపర్ ట్రైన్ రాబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై అధికారులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
Vande Bharat: ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు త్వరలోనే ఒక తీపి కబురు అందబోతోందనే వార్త ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కోస్తా ఆంధ్రలోని ప్రముఖ పారిశ్రామిక నగరం విశాఖపట్నం నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరు నగరానికి సరికొత్త 'వందేభారత్ స్లీపర్' రైలును అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. సాధారణంగా ప్రస్తుతం నడుస్తున్న రైళ్లలో విశాఖ నుంచి బెంగళూరు చేరడానికి 18 నుంచి 20 గంటల సమయం పడుతుండగా, ఈ స్లీపర్ రైలు అందుబాటులోకి వస్తే కేవలం 14 గంటల వ్యవధిలోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చని తెలుస్తోంది.
సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న సమయాలు
దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారులు రూపొందించినట్లుగా చెబుతున్న ఒక రూట్ మ్యాప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ సమాచారం ప్రకారం... ఈ రైలు సోమవారం తప్ప మిగిలిన వారానికి 6 రోజులు సర్వీసులను అందించనుంది. విశాఖపట్నంలో రాత్రి 8:15 గంటలకు బయలుదేరి దువ్వాడ (రాత్రి 8:45), కృష్ణా కెనాల్ (అర్ధరాత్రి 1:05), నంద్యాల (తెల్లవారుజామున 4:40), ధర్మవరం (ఉదయం 7:30) మీదుగా ఉదయం 10:00 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో బెంగళూరులో రాత్రి 8:00 గంటలకు బయలుదేరి ధర్మవరం (రాత్రి 10:30), నంద్యాల (అర్ధరాత్రి 1:02), కృష్ణా కెనాల్ (తెల్లవారుజామున 4:55), దువ్వాడ (ఉదయం 9:15) మీదుగా ఉదయం 10:00 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. రైల్వే బోర్డు ఆదేశాల మేరకు విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్ల అధికారులు రూట్ మ్యాప్పై ప్రాథమిక నివేదిక సిద్ధం చేసినట్లు ప్రచారం సాగుతోంది.
స్పందించిన సీనియర్ రైల్వే అధికారి
ఈ ప్రచారంపై రైల్వే శాఖ సీనియర్ అధికారులు స్పష్టత ఇచ్చారు. విశాఖపట్నం-బెంగళూరు మార్గంలో వందేభారత్ స్లీపర్ రైలును నడపాలనే డిమాండ్ చాలా కాలంగా ప్రజల నుంచి ఉందన్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. అయితే, ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్త కేవలం రైల్వే శాఖలో జరిగే అంతర్గత పరిశీనలో భాగం మాత్రమేనని ఆయన తెలిపారు. విశాఖ నుంచి కొత్త సర్వీసులను నడిపేందుకు వీలైన మార్గాలను అధ్యయనం చేయడానికి డివిజన్లకు అంతర్గత ఆదేశాలు వెళ్తుంటాయని, అంతమాత్రాన రైలు సమయాలు ఖరారైపోయినట్లు కాదని ఆయన పేర్కొన్నారు. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది న్యూఢిల్లీలోని రైల్వే బోర్డు మాత్రమేనని, బోర్డు నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు దీనిపై స్పష్టత రాదని స్పష్టం చేశారు.




