Weather Update: తస్మాత్ జాగ్రత్త.. తెలుగు రాష్ట్రాల్లో నేడు దంచికొట్టనున్న వర్షాలు

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

CR Reddy
Published on: 8 Aug 2026 8:12 AM IST
Weather Update
X

Weather Update

Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. రాబోయే 24 గంటల్లో రెండు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరికలు జారీ చేశాయి. ఆకాశం మేఘావృతమై ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి.

ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర జిల్లాలపై అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. వీటితో పాటు అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, మార్కాపురం, రాయలసీమ ప్రాంత పరిధిలోని మొత్తం 16 జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదు కావొచ్చని అంచనా వేశారు. విజయవాడ, అమరావతి పరిసర ప్రాంతాల్లో మేఘావృతమై ఉండి తేలికపాటి జల్లులు పడతాయని, విశాఖ తీరంలో 79 శాతం తేమతో కూడిన వాతావరణం ఉంటుందని అధికారులు వివరించారు.

గంటకు 50 కి.మీ వేగంతో గాలులు

వర్షాలతో పాటు సముద్ర తీరం పొడవునా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో భీకర ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని అధికారులు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు కూడా వర్షం, గాలుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్‌ల వద్ద నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు.

తెలంగాణ, హైదరాబాద్‌లో పరిస్థితి

ఇక తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో ఆకాశం మబ్బుపట్టి అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. నిజామాబాద్, వరంగల్ ప్రాంతాల్లో 80 నుండి 85 శాతం తేమ నమోదు కావొచ్చని, ఉష్ణోగ్రతలు గరిష్టంగా 27 డిగ్రీల నుండి 29 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశముందని వాతావరణ నిపుణులు వెల్లడించారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story