YS Sharmila: జగన్ ఓ 'మావిగన్ జోకర్'.. వైఎస్సార్ ఆశయాలను చంపేశారు
YS Sharmila: వైఎస్ జగన్ కేవలం రాజశేఖర్ రెడ్డి పేరును వాడుకుంటున్నారని, ఆయన ఆశయాలను తుంగలో తొక్కారని వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు.
YS Sharmila: జగన్ ఓ 'మావిగన్ జోకర్'.. వైఎస్సార్ ఆశయాలను చంపేశారు
YS Sharmila: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సొంత అన్నపై విమర్శనాస్త్రాలు సంధించారు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. జగన్ మోహన్ రెడ్డి కేవలం వైఎస్సార్ పేరును రాజకీయంగా వాడుకుంటున్నారని, కానీ ఆయన ఆశయాలకు వారసుడు కాలేకపోయారని ఆమె ఎద్దేవా చేశారు.
వైఎస్సార్ ఆశయాలకు తూట్లు
వైఎస్సార్ భావజాలం ఉంటే ఆయన కలల ప్రాజెక్ట్ అయిన జలయజ్ఞాన్ని ఎందుకు పూర్తి చేయలేదని షర్మిల ప్రశ్నించారు. వైఎస్సార్ బద్ధవ్యతిరేకి అయిన భాజపాకు జగన్ 'దత్తపుత్రుడి'లా మారిపోయారని విమర్శించారు. ఎస్సీలు, క్రైస్తవులపై దాడులు జరుగుతుంటే రాష్ట్ర సీఎంగా జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
లిక్కర్ మాఫియా.. రుషికొండ ప్యాలెస్లపై ధ్వజం
జగన్ పాలనపై షర్మిల సంధించిన ప్రధాన విమర్శలు ఇవే.. "మాట తప్పం మడమ తిప్పం" అని చెప్పి, సంపూర్ణ మద్యపాన నిషేధం హామీని తుంగలో తొక్కారని మండిపడ్డారు. కల్తీ మద్యం అమ్ముతూ, కేవలం నగదు (Only Cash) తీసుకుంటూ లిక్కర్ మాఫియా నడిపారని ఆరోపించారు. మూడు రాజధానుల పేరుతో రుషికొండను మింగేసి, అక్కడ విలాసవంతమైన ప్యాలెస్లు కట్టుకున్నారని విమర్శించారు.వైఎస్సార్ హయాంలో రాష్ట్రం నుంచే దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తుంటే జగన్ ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు.
"మావిగన్ జోకర్"
జగన్ ఇచ్చిన హామీలకు, చేస్తున్న పనులకు పొంతన లేదని.. ఇప్పుడు ఆయన కేవలం ఒక "మావిగన్ జోకర్"గా మిగిలిపోయారని షర్మిల ఘాటుగా వ్యాఖ్యానించారు. వైఎస్సార్ లైన్ వాడుకోవడం తప్ప, ఆయన పాలనలో వైఎస్సార్ మార్కు ఎక్కడా కనిపించడం లేదని ఆమె స్పష్టం చేశారు.


