Bajaj EV : త్వరలోనే బజాజ్ తొలి ఎలక్ట్రిక్ బైక్.. లాంచ్ టైమ్‌లైన్ ప్రకటించిన దిగ్గజ సంస్థ

Bajaj EV : భారత ఈవీ టూ-వీలర్ మార్కెట్‌లో ప్రస్తుతం రెండవ అతిపెద్ద కంపెనీగా కొనసాగుతున్న బజాజ్ ఆటో, ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ విభాగాన్ని ఏలేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

CR Reddy
Published on: 23 July 2026 9:46 AM IST
Bajaj EV
X

Bajaj EV 

Bajaj EV : భారత ఈవీ టూ-వీలర్ మార్కెట్‌లో ప్రస్తుతం రెండవ అతిపెద్ద కంపెనీగా కొనసాగుతున్న బజాజ్ ఆటో, ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ విభాగాన్ని ఏలేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాల సందర్బంగా జరిగిన కాన్ఫరెన్స్ కాల్‌లో, వచ్చే ఆర్థిక సంవత్సరంలో తమ తొలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ను మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు కంపెనీ యాజమాన్యం అధికారికంగా వెల్లడించింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్, హీరో వంటి కంపెనీల పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మోటార్ సైకిల్ విభాగాన్ని ముందుగానే ఆక్రమించుకోవాలని బజాజ్ భావిస్తోంది.

ప్రస్తుతం బజాజ్ విక్రయిస్తున్న చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ ఏడాది ఏప్రిల్ - జూన్ 2026 మధ్య కాలంలో బజాజ్ మొత్తం స్థానిక వ్యాపార ఆదాయంలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా ఏకంగా 30 శాతానికి చేరింది. చేతక్ స్కూటర్లకు వినియోగదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్, సరఫరా సమస్యలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నెలకు 50,000 యూనిట్లుగా ఉన్న చేతక్ ప్రొడక్షన్ కెపాసిటీని రాబోయే కొద్ది నెలల్లో 60,000 యూనిట్లకు పెంచాలని యోచిస్తోంది.

మరోవైపు కంపెనీ ఇటీవలే ప్రవేశపెట్టిన ఫ్రీడమ్ సిఎన్‌జి మోటార్ సైకిల్‌కు మార్కెట్‌లో మోస్తరు స్పందన మాత్రమే లభించింది. దీంతో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా జీరో ఎమిషన్ ఎలక్ట్రిక్ బైక్స్ వైపు దృష్టి సారించింది. ఇప్పటికే స్థానిక వ్యాపారంలో టూ-వీలర్లు, త్రీ-వీలర్ల విక్రయాలు రెండంకెల వృద్ధిని సాధించడమే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా వచ్చిన రాబడి మునుపటి ఏడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపు అయింది.

ఆర్థిక పరంగా కూడా బజాజ్ ఆటో సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం ఏటా 37 శాతం పెరిగి రూ.17,244 కోట్లకు చేరగా, పన్నుల తర్వాత నికర లాభం 40 శాతానికి పైగా పెరిగి దాదాపు రూ.3,000 కోట్లను దాటింది. ఎగుమతుల విషయానికి వస్తే, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో భారీ విక్రయాలు నమోదు కావడంతో కంపెనీ చరిత్రలోనే తొలిసారిగా 7 లక్షలకు పైగా ఎగుమతుల మార్కును దాటింది. ముఖ్యంగా నైజీరియాలో మూడు రెట్ల వృద్ధి నమోదైంది. ఈ భారీ లాభాలు, మార్కెట్ ప్రోత్సాహంతోనే బజాజ్ తమ ఈవీ పోర్ట్‌ఫోలియోను వేగంగా విస్తరించేందుకు అడుగులు వేస్తోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story