ఫుల్ ఛార్జ్తో 500 కిమీల మైలేజ్.. బ్యాటరీపై లైఫ్టైమ్ వారంటీతో రానున్న కియా కొత్త కార్..!
Kia Syros EV: ప్రస్తుతం మార్కెట్లో కియా సైరోస్ ఈవీ గురించిన ఆసక్తికరమైన సమాచారం లీకై నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ కారును రెండు విభిన్న బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో కియా సంస్థ రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది.
ఫుల్ ఛార్జ్తో 500 కిమీల మైలేజ్.. బ్యాటరీపై లైఫ్టైమ్ వారంటీతో రానున్న కియా కొత్త కార్..!
Kia Syros EV: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. అయితే కొత్తగా ఈవీ కారు కొనాలనుకునే వారిని వేధించే ప్రధాన సమస్యలు రెండే రెండు. ఒకటి మైలేజ్ రేంజ్, రెండు బ్యాటరీ మన్నిక. వినియోగదారుల మనసులోని ఈ భయాలను పూర్తిగా పటాపంచలు చేస్తూ, దేశీయ ఈవీ మార్కెట్లో సరికొత్త సంచలనానికి కియా ఇండియా సిద్ధమైంది. సరికొత్త సాంకేతికత, అదిరిపోయే రేంజ్, పరిశ్రమలోనే అపూర్వమైన బ్యాటరీ వారంటీతో కియా సైరోస్ ఈవీ (Kia Syros EV) త్వరలోనే మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది.
లీకైన వివరాలు.. ఒకే ఛార్జ్తో 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణం..!
ప్రస్తుతం మార్కెట్లో కియా సైరోస్ ఈవీ గురించిన ఆసక్తికరమైన సమాచారం లీకై నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ కారును రెండు విభిన్న బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో కియా సంస్థ రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. అందులో మొదటిది 42 కిలోవాట్ అవర్ (kWh) బ్యాటరీ కాగా, రెండవది మరింత శక్తివంతమైన 51.4 కిలోవాట్ అవర్ (kWh) బ్యాటరీ ప్యాక్.
సాధారణంగా పెద్ద కార్లతో పోలిస్తే ఈ కారు బరువు తక్కువగా ఉండటం వల్ల బ్యాటరీ సామర్థ్యం అద్భుతంగా పని చేస్తుంది. ఈ క్రమంలోనే చిన్న బ్యాటరీ ప్యాక్ సుమారు 443 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా, పెద్ద బ్యాటరీ ప్యాక్ ఏకంగా 520 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్ అందిస్తుందని సమాచారం. అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎలాంటి టెన్షన్ లేకుండా నగరాల మధ్య సుదీర్ఘ ప్రయాణాలు చేయవచ్చన్నమాట.
బ్యాటరీపై ఏకంగా 15 ఏళ్లు లేదా లైఫ్టైమ్ వారంటీ..!
ఈ సరికొత్త ఈవీ కారుకు సంబంధించి లీకైన విషయాలలో అత్యంత ఆకర్షణీయమైనది బ్యాటరీ వారంటీ. సాధారణంగా కార్ల కంపెనీలు బ్యాటరీలపై 8 ఏళ్ల వారంటీ మాత్రమే ఇస్తాయి. కానీ కియా ఇండియా ఒక అడుగు ముందుకు వేసి, ఈ కారు బ్యాటరీపై ఏకంగా 15 సంవత్సరాలు లేదా లైఫ్టైమ్ (జీవితకాల) వారంటీని అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
భారతదేశ ఆటోమొబైల్ రంగ చరిత్రలోనే ఇదొక విప్లవాత్మక నిర్ణయం కానుంది. దీనివల్ల బ్యాటరీ పాడైపోతుందనే వినియోగదారుల ఆందోళన పూర్తిగా తొలగిపోవడమే కాకుండా, భవిష్యత్తులో కారును సెకండ్ హ్యాండ్ మార్కెట్లో విక్రయించినా మంచి ధర లభించే అవకాశం ఉంటుంది. దీనితో పాటు 3 ఏళ్ల స్టాండర్డ్ వాహన వారంటీ, దీనిని 7 ఏళ్లు లేదా 1.6 లక్షల కిలోమీటర్ల వరకు పొడిగించుకునే సదుపాయాన్ని కూడా కంపెనీ కల్పిస్తోంది.
లగ్జరీ ఫీచర్లు.. అధునాతన భద్రత..!
కియా సైరోస్ ఈవీ కేవలం మైలేజ్, వారంటీలోనే కాకుండా ఫీచర్ల పరంగానూ టాప్ క్లాస్ లో నిలవనుంది. కారు లోపల విశాలమైన క్యాబిన్ తో పాటు టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్రూఫ్, చల్లటి గాలిని అందించే వెంటిలేటెడ్ సీట్లు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ప్రీమియం సౌకర్యాలను అమర్చారు. భద్రతకు పెద్దపీట వేస్తూ లెవెల్ 2 అడాస్ (ADAS) సాంకేతికత, డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఇతర వాహనాలకు లేదా పరికరాలకు ఛార్జ్ చేసుకునే వెహికల్-టు-లోడ్ (V2L) ఫీచర్లు కూడా ఇందులో ఉండబోతున్నాయి.
ఇప్పటికే మార్కెట్లో ఉన్న టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా ఎక్స్యూవీ 3XO ఈవీ వంటి కార్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు కియా సైరోస్ ఈవీ అన్ని అస్త్రాలతో సిద్ధమవుతోంది. రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల ధరల శ్రేణిలో ఈ కారు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకే ఛార్జ్ పై 500 కిలోమీటర్ల మైలేజ్, బ్యాటరీపై లైఫ్ టైం భరోసా అనేవి నిజమైతే మాత్రం, భారతీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో కియా సైరోస్ ఈవీ తిరుగులేని రారాజుగా నిలవడం ఖాయం.




