Piaggio Ape WavE : లక్షల్లో మైలేజ్.. రూపాయిల్లో ఖర్చు.. పియాజియో కొత్త ఈ-ఆటో.!
Piaggio Ape WavE : ప్రముఖ వాహన తయారీ సంస్థ పియాజియో వెహికల్స్ (Piaggio Vehicles) భారత మార్కెట్లో తన ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల శ్రేణిని మరింత విస్తరించింది.
Piaggio Electric Auto
Piaggio Ape WavE : ప్రముఖ వాహన తయారీ సంస్థ పియాజియో వెహికల్స్ (Piaggio Vehicles) భారత మార్కెట్లో తన ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల శ్రేణిని మరింత విస్తరించింది. ఇందులో భాగంగా సరికొత్త ‘ఆపే వేవ్’ (Ape WavE) ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ను లాంచ్ చేసింది. L3 ప్యాసింజర్ ఈవీ (EV) కేటగిరీలో తీసుకొచ్చిన ఈ కొత్త ఎలక్ట్రిక్ ఆటో ప్రారంభ ధరను రూ. 2.55 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) సంస్థ నిర్ణయించింది. నగరాల్లో తక్కువ ఖర్చుతో ప్రయాణికులను చేరవేసేందుకు, ముఖ్యంగా షేర్డ్ మొబిలిటీ, స్థిర మార్గాల్లో నడిచే సర్వీసుల కోసం దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
పవర్ఫుల్ బ్యాటరీ.. అదిరిపోయే రేంజ్
పియాజియో ఆపే వేవ్ ఎలక్ట్రిక్ ఆటోలో 5.4 kWh సామర్థ్యం గల శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్ను అమర్చారు. దీనిలోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 3 kW పవర్, 25 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సిటీ రోడ్లపై గరిష్టంగా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో (Top Speed) ప్రయాణించగలదు. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే నిజమైన వాతావరణంలో (Real-world range) సుమారు 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని పియాజియో క్లెయిమ్ చేసింది. ఈ బ్యాటరీ పూర్తిగా రీఛార్జ్ కావడానికి దాదాపు 4.5 గంటల సమయం పడుతుంది.
రోడ్లపై సాఫీ ప్రయాణం.. పటిష్టమైన బాడీ
ఈ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్కు 19 శాతం గ్రేడబిలిటీని (Gradeability) అందించారు. దీనివల్ల నగరాల్లోని ఫ్లైఓవర్లు, ఎత్తుపల్లాల రోడ్లను ఇది ఎంతో సులభంగా ఎక్కగలదు. పూర్తి మెటల్ బాడీ , మోనోకోక్ ఆర్కిటెక్చర్తో నిర్మించడం వల్ల కమర్షియల్ అవసరాలకు ఇది చాలా కాలం మన్నికను ఇస్తుంది. ప్రయాణికులకు మంచి సౌకర్యాన్ని అందించేందుకు ప్రత్యేక సస్పెన్షన్ సెటప్ను ఏర్పాటు చేశారు. ఇది ప్రయాణంలో వచ్చే శబ్దాలు, ప్రకంపనలను (Vibrations) తగ్గిస్తుంది. అంతేకాకుండా, దీనికి 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం వల్ల ఎలాంటి రోడ్లపైనైనా సాఫీగా దూసుకెళ్తుంది. లోపల క్యాబిన్ కూడా చాలా విశాలంగా ఉండి, ప్రయాణికులు హాయిగా కూర్చునేలా రూపొందించారు.
తక్కువ ఖర్చు.. ఎక్కువ ఆదాయం
రవాణా రంగంలో ఉండే ఫ్లీట్ ఆపరేటర్లు, వ్యక్తిగత యజమానులకు తక్కువ కొనుగోలు ధర , తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులతో ఎక్కువ ఆదాయాన్ని అందించడమే ఈ వాహనం ముఖ్య ఉద్దేశం. పియాజియో వెహికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ డియెగో గ్రాఫీ మాట్లాడుతూ.. "భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగం వేగంగా మారుతోంది. ముఖ్యంగా త్రీ-వీలర్ కేటగిరీలో కస్టమర్లు నమ్మకమైన, తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాల కోసం చూస్తున్నారు. డ్రైవర్లకు తక్కువ పెట్టుబడితో పాటు మెరుగైన సౌకర్యం, భద్రత, నమ్మకాన్ని అందించేందుకే ఈ ఆపే వేవ్ను ప్రత్యేకంగా అభివృద్ధి చేశాం" అని పేర్కొన్నారు.




