Bhongir: నితిన్ గడ్కరీని కలసి వినతిపత్రం సమర్పించిన భువనగిరి ఎంపీ!
Bhongir: నియోజకవర్గంలో రోడ్డు భద్రత, మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వినతిపత్రం ఇచ్చారు.
Bhongir: నితిన్ గడ్కరీని కలసి వినతిపత్రం సమర్పించిన భువనగిరి ఎంపీ!
భువనగిరి: భువనగిరి పార్లమెంటు సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గౌరవనీయులైన కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారిని కలిసి, భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ పరిసర ప్రాంతాలలో అనేక ముఖ్యమైన రోడ్డు మౌలిక వసతులు మరియు భద్రతా పనులను వేగవంతం చేయాల్సిందిగా కోరారు.
ఈ సమావేశంలో ఎంపీ పలు కీలక ప్రాజెక్టులపై ప్రాధాన్యతతో కూడిన జోక్యాన్ని కోరుతూ సమగ్ర వినతిపత్రాలను సమర్పించి చర్చించారు. హైదరాబాద్ మరియు వరంగల్ మధ్య ఉన్న NH-163 ను ఆరు లైన్ల జాతీయ రహదారిగా అప్గ్రేడ్ చేయడం ప్రధాన డిమాండ్గా ఉంది. ఈ కీలక కారిడార్లో వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, పారిశ్రామిక కార్యకలాపాలు, ట్రాఫిక్ కదలికలను శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తావించారు. విస్తరణ మరియు అనుబంధ మెరుగుదల కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రిత్వ శాఖను కోరారు.
అలాగే, NH-163 పై అనేక రోడ్డు భద్రతా అవసరాలను కూడా ఎంపీ లేవనెత్తారు, వాటిలో:
* అనంతారం క్రాస్ రోడ్డు వద్ద అండర్పాస్ / సర్వీసు రోడ్ల నిర్మాణం.
* ప్రభుత్వ ఐటీఐ కాలేజ్ - రామకృష్ణపురం విలేజ్ క్రాస్ రోడ్డు వద్ద అండర్పాస్ నిర్మాణం, అలాగే భువనగిరిలోని కేంద్రీయ విద్యాలయ సమీపంలో సర్వీసు రోడ్ల నిర్మాణం.
* స్వర్ణగిరి ఆలయం వద్ద వెహిక్యులర్ అండర్పాస్ నిర్మాణం.
* 12వ వార్డు, పగిడిపల్లి గ్రామంలో పెండింగ్లో ఉన్న డ్రైనేజీ పనుల పూర్తి.
* బీబీనగర్ ఎయిమ్స్ (AIIMS) వద్ద మంజూరైన ఆరు లైన్ల ఫ్లైఓవర్ పనుల ప్రారంభం.
* సింగన్నగూడెం క్రాస్ రోడ్డు వద్ద సర్వీసు రోడ్లతో పాటు అండర్పాస్ల ఏర్పాటు.
నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో NH-565 పై నకిరేకల్ - తాటికల్ రోడ్డు విస్తరణ, చందంపల్లి వద్ద ప్రతిపాదిత లూప్ ఫోర్, పద్మనగర్ మరియు ఇనుపముల వద్ద ఫ్లైఓవర్లు, కోర్లపహాడ్, కేతేపల్లి, చీకటిగూడెం, వట్టిమర్తి, పిట్టంపల్లి వద్ద అండర్పాస్లతో పాటు డ్రైనేజీ మరియు సర్వీసు రోడ్డు పనులతో సహా అనేక రోడ్డు భద్రత మరియు కనెక్టివిటీ అవసరాలను కూడా ఎంపీ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
NH-365 (హైదరాబాద్ - విజయవాడ) పై లక్ష్మారెడ్డి పల్లెం -పెద్ద అంబర్పేట్ వద్ద ఉన్న హనుమాన్ ఆలయం సమీపంలో పుట్-ఓవర్ బ్రిడ్జి నిర్మాణంపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యంగా పండుగల సమయంలో ఆలయం వద్ద భక్తులు మరియు జనల రద్దీ ఎక్కువగా ఉంటుందని, దీనివల్ల ట్రాఫిక్ జామ్ మరియు భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని ఎంపీ తెలిపారు.
భువనగిరి ప్రజలకు, పరిసర ప్రాంతాల వారికి మెరుగైన కనెక్టివిటీ కల్పించడంతో పాటు రోడ్డు భద్రతను పెంపొందించడం, ప్రమాదాలను నివారించడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించి రాకపోకలు సజావుగా సాగేందుకు పైన పేర్కొన్న ప్రాజెక్టులు ఎంతో కీలకమని చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ముఖ్యమైన పనులను త్వరితగతిన చేపట్టేందుకు అవసరమైన ప్రక్రియలను వేగవంతం చేయడంలో కేంద్ర మంత్రి మరియు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సహకారం ఎంతో అవసరమని ఆయన వ్యక్తం చేశారు.




