Adani Ports: దూసుకుపోతున్న అదానీ.. అర్జెంటీనాలో 10 ఏళ్ల మెగా కాంట్రాక్ట్ దక్కించుకున్న APSEZ!
Adani Ports: భారతదేశపు అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ యుటిలిటీ సంస్థ అయిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్(APSEZ) అంతర్జాతీయంగా మరో భారీ విజయాన్ని అందుకుంది.
Adani Ports: దూసుకుపోతున్న అదానీ.. అర్జెంటీనాలో 10 ఏళ్ల మెగా కాంట్రాక్ట్ దక్కించుకున్న APSEZ!
Adani Ports: భారతదేశపు అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ యుటిలిటీ సంస్థ అయిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్(APSEZ) అంతర్జాతీయంగా మరో భారీ విజయాన్ని అందుకుంది. దక్షిణ అమెరికా దేశమైన అర్జెంటీనాలో ఒక ప్రతిష్టాత్మకమైన 10 ఏళ్ల మెరైన్ సర్వీసెస్ కాంట్రాక్టును ఈ సంస్థ దక్కించుకుంది. అర్జెంటీనా దేశపు మొట్టమొదటి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) ఎగుమతి ప్రాజెక్టుకు సంబంధించి ఈ ఒప్పందం కుదిరింది. దీని ద్వారా గ్లోబల్ మెరైన్ సర్వీసెస్ రంగంలో అదానీ గ్రూప్ తన పట్టును మరింత బలంగా చాటుకుంది.
సౌతర్న్ ఎనర్జీ సంస్థ అంతర్జాతీయంగా నిర్వహించిన అత్యంత కఠినమైన గ్లోబల్ కాంపిటీటివ్ టెండర్ ప్రక్రియలో అదానీ గ్రూప్ విజేతగా నిలిచింది. APSEZ కు చెందిన సబ్సిడరీ సంస్థ ది అదానీ హార్బర్ ఇంటర్నేషనల్ FZCO, అర్జెంటీనాకు చెందిన ప్రముఖ మెరిడియన్ గ్రూప్తో కలిసి ఒక కన్సార్టియంగా ఏర్పడి ఈ టెండర్ దక్కించుకుంది. ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు 70 మిలియన్ డాలర్ల (సుమారు రూ.580 కోట్లకు పైగా) భారీ పెట్టుబడి పెట్టడానికి ఈ కన్సార్టియం సిద్ధమైంది. ఈ కాంట్రాక్టును నిర్వహించడానికి వీరు 51:49 నిష్పత్తితో మెరిడియన్ ట్రాన్స్పోర్టెస్ మారిటిమోస్ ఎస్.ఏ. అనే జాయింట్ వెంచర్ కంపెనీని కూడా ఏర్పాటు చేశారు.
ఈ పదేళ్ల ఒప్పందంలో భాగంగా, అర్జెంటీనా గ్యాస్ క్షేత్రాల వద్ద అదానీ కన్సార్టియం పూర్తి స్థాయి ఎండ్-టు-ఎండ్ మెరైన్ సేవలను అందించనుంది. ఎల్ఎన్జీ క్యారియర్ షిప్ల కోసం భారీ టగ్ బోట్ ఆపరేషన్స్ నిర్వహించడం, ఆఫ్షోర్ లాజిస్టిక్స్, సప్లై సపోర్ట్, సముద్రంలో సిబ్బందిని ఒకచోటి నుంచి మరోచోటికి చేరవేసే క్రూ ట్రాన్స్ఫర్ సేవలు ఇందులో ఉన్నాయి. ఈ సేవల కోసం ప్రత్యేకంగా నాలుగు హై-స్పెసిఫికేషన్ టగ్ బోట్లు, ఒక యాంకర్ హ్యాండ్లింగ్ టగ్ సప్లై వెజెల్, ఒక క్రూ బోటును రంగంలోకి దించుతున్నారు.
ప్రస్తుతం అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో అర్జెంటీనా ఒక సరికొత్త శక్తుగా ఎదుగుతోంది. ఈ దేశం నుంచి 2027 నాటికి ప్రతి సంవత్సరం దాదాపు 10 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ గ్యాస్ను భారతదేశానికి ఎగుమతి చేయడానికి ఇప్పటికే కీలక ఒప్పందాలు జరిగాయి. అర్జెంటీనాలోని రియో నెగ్రో ప్రావిన్స్లో ఉన్న శాన్ మతియాస్ గల్ఫ్ వద్ద సౌతర్న్ ఎనర్జీ ఎఫ్ఎల్ఎన్జీ ప్రాజెక్టును గొలార్ ఎల్ఎన్జీ, పాన్ అమెరికన్ ఎనర్జీ (PAE) సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. జనరల్ శాన్ మార్టిన్ పైప్లైన్ ద్వారా వచ్చే సహజ వాయువును ఇక్కడి హిల్లి ఎపిసియో అనే ఫ్లోటింగ్ నౌకపై ద్రవరూపంలోకి మారుస్తారు. దీని కమర్షియల్ ఆపరేషన్స్ సెప్టెంబర్ 2027 లో ప్రారంభం కానున్నాయి.
ఈ విజయవంతమైన ప్రాజెక్టుపై APSEZ హోల్-టైమ్ డైరెక్టర్, సీఈఓ అశ్వని గుప్తా మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి భారీ ఇంధన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మద్దతు ఇచ్చే సామర్థ్యం తమకు ఉందని నిరూపితమైందని అన్నారు. ఇప్పటికే ప్రపంచంలోని 12 దేశాలలో అదానీ మెరైన్ ఆపరేషన్స్ నడుస్తున్నాయని చెప్పారు. దేశీయంగా చూస్తే, భారతదేశపు పశ్చిమ, దక్షిణ, తూర్పు తీరాలలో అదానీ గ్రూప్ 15 వ్యూహాత్మక పోర్టులు మరియు టెర్మినళ్లను విజయవంతంగా నిర్వహిస్తోంది. అంతేకాకుండా ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, టాంజానియా, శ్రీలంక (కొలంబో) లలో 4 అంతర్జాతీయ పోర్టులను కూడా రన్ చేస్తోంది.
అదానీ గ్రూప్ ప్రస్తుతం 136 నౌకల భారీ సముద్ర నౌకాదళాన్ని కలిగి ఉంది. వీటితో పాటు 12 మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ పార్కులు, 31 లక్షల చదరపు అడుగుల గిడ్డంగులు, 25,000 కంటే ఎక్కువ ట్రక్కులతో దేశంలోనే అత్యంత శక్తివంతమైన నెట్వర్క్ను నడుపుతోంది. ప్రస్తుతం ఏడాదికి 653 మిలియన్ టన్నుల కార్గోను హ్యాండిల్ చేస్తూ.. భారత పోర్టుల మొత్తం వాల్యూమ్లో 27 శాతం వాటాను అదానీ గ్రూప్ సొంతం చేసుకుంది. 2030 నాటికి ఈ సామర్థ్యాన్ని 1 బిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిరతలోనూ అంతర్జాతీయంగా టాప్ 5 శాతంలో నిలిచిన APSEZ, ఈ కొత్త గ్లోబల్ కాంట్రాక్టుతో అంతర్జాతీయ వ్యాపార రంగంలో మరో మైలురాయిని దాటింది.




