దుబాయ్ వెళ్లేవారికి శుభవార్త.. బుర్జ్ ఖలీఫా టికెట్లు ఇప్పుడు యూపీఐతోనే బుక్ చేసుకోండి
దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా 'అట్ ది టాప్' టికెట్లను ఇప్పుడు యూపీఐ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయాన్ని ఎన్పీసీఐ ప్రకటించింది.
Burj Khalifa
దుబాయ్లోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాను సందర్శించాలనుకునే భారతీయులకు శుభవార్త. ఇకపై 'అట్ ది టాప్, బుర్జ్ ఖలీఫా' అధికారిక వెబ్సైట్లో టికెట్లను యూపీఐ (UPI) ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అంతర్జాతీయ విభాగమైన ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్ఐపీఎల్), నియోపే (NEOPAY), ఎమార్ ఎంటర్టైన్మెంట్ భాగస్వామ్యంతో ఈ సేవను ప్రారంభించినట్లు బుధవారం ప్రకటించింది.
ఇప్పటికే 2022 నుంచి యూఏఈలో నియోపే వ్యాపార నెట్వర్క్లో క్యూఆర్ కోడ్ ఆధారిత యూపీఐ చెల్లింపులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఆ సదుపాయాన్ని మరింత విస్తరించి, బుర్జ్ ఖలీఫా అధికారిక వెబ్సైట్లోనే ముందస్తుగా టికెట్లు బుక్ చేసి యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే అవకాశం కల్పించారు.
దీంతో భారతీయ పర్యాటకులు యూఏఈకి చేరుకునే ముందే తమకు కావాల్సిన అనుభవ ప్యాకేజీని ఎంపిక చేసుకుని సులభంగా చెల్లింపులు పూర్తి చేసుకోవచ్చని ఎన్ఐపీఎల్ తెలిపింది. దీంతో ప్రయాణ ప్రణాళిక మరింత సౌకర్యవంతంగా మారుతుందని పేర్కొంది.
ఈ సందర్భంగా ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ రీతేష్ శుక్లా మాట్లాడుతూ, భారతీయులు విశ్వసించే యూపీఐ ద్వారా బుర్జ్ ఖలీఫా టికెట్లను ముందుగానే బుక్ చేసుకునే అవకాశం కల్పించడం సంతోషకరమని అన్నారు.
ఎన్పీసీఐకి పూర్తిగా అనుబంధ సంస్థగా ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్ఐపీఎల్) 2020 ఏప్రిల్ 3న స్థాపించబడింది.




