Gold Rate Today : సామాన్యులకు షాక్.. పసిడి ధరల దూకుడు.. వెండి ఆల్ టైమ్ రికార్డ్

Gold Rate Today : మార్చి 12, 2026న బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం రూ. 1,63,320 కాగా, వెండి కిలోకు రూ. 2,99,900గా ఉంది.

CR Reddy
Published on: 12 March 2026 6:46 AM IST
Gold Rate Today
X

Gold Rate Today

Gold Rate Today : బులియన్ మార్కెట్‌లో మంటలు పుడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కాస్త శాంతించిన పసిడి ధరలు, ఒక్కసారిగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. కేవలం బంగారం మాత్రమే కాదు, వెండి కూడా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా వెండి ధర కిలోకు మూడు లక్షల రూపాయల దరిదాపుల్లోకి చేరడం ఇన్వెస్టర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు పరిశీలిస్తే, విపరీతమైన పెరుగుదల కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల రాజధాని హైదరాబాద్‌లో 24 క్యారెట్ల (తొమ్మిది వన్నె) 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,63,320 వద్ద కొనసాగుతోంది. ఇక సామాన్యులు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,49,710గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ధరలు మరింత ఘాటుగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల పసిడి రూ.1,63,470కి చేరగా, 22 క్యారెట్ల పసిడి రూ.1,49,860 వద్ద ట్రేడవుతోంది. చెన్నైలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది, అక్కడ 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1,64,960గా పలుకుతోంది.

మరోవైపు వెండి ధరలు వింటే గుండె జారాల్సిందే. హైదరాబాద్, చెన్నై, కేరళ వంటి ప్రాంతాల్లో కిలో వెండి ధర దాదాపు మూడు లక్షల రూపాయల మైలురాయిని (రూ.2,99,900) తాకింది. ఇతర మెట్రో నగరాలైన ముంబై, కోల్‌కతా వంటి చోట్ల కిలో వెండి రూ.2,89,900 వద్ద విక్రయించబడుతోంది. పారిశ్రామికంగా వెండికి డిమాండ్ పెరగడం, సోలార్ ప్యానెళ్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో వెండి వినియోగం ఎక్కువ కావడంతో ఈ స్థాయిలో ధరలు ఎగబాకుతున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వెండి కూడా బంగారానికి ఏమాత్రం తీసిపోకుండా పోటీపడుతూ ధరల రేసులో దూసుకుపోతోంది.

ఈ ధరల పెరుగుదల వెనుక అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ అనిశ్చితి ప్రధాన పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ మేఘాలు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఇలాంటి సంక్షోభ సమయాల్లో మదుపర్లు స్టాక్ మార్కెట్ల కంటే సురక్షితమైన బంగారంపై పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపుతారు. దీనికి తోడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన కొన్ని సానుకూల వ్యాఖ్యల వల్ల డాలర్ ఇండెక్స్ స్వల్పంగా బలహీనపడింది. డాలర్ విలువ తగ్గినప్పుడు విదేశీ కరెన్సీ వినియోగదారులకు బంగారం చౌకగా మారుతుంది, తద్వారా డిమాండ్ పెరిగి ధరలు కూడా అమాంతం పెరిగిపోతాయి.

స్థానికంగా చూస్తే, పెళ్లిళ్ల సీజన్, పండుగల వేళ బంగారం కొనాలని ఆశపడే సామాన్యులకు ఈ ధరలు పెద్ద షాక్ అని చెప్పాలి. కేవలం బంగారం ధర మాత్రమే కాకుండా, దీనికి మేకింగ్ ఛార్జీలు (తయారీ ఖర్చులు),3 శాతం జీఎస్టీ (GST) అదనంగా కలుస్తాయి. అంటే పైన చెప్పుకున్న ధరలకు తోడు కనీసం మరో 10 నుంచి 15 శాతం వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది. అందువల్ల ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు హాల్‌మార్కింగ్ వివరాలను పరిశీలించి, తులం ధరను సరిచూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

CR Reddy

CR Reddy

Next Story