Today Gold Rate: మళ్లీ భగ్గుమన్న బంగారం, వెండి... 6 రోజుల్లో ఎంత పెరిగిందో తెలుసా..?

Today Gold Rate: దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ రికార్డు స్థాయికి చేరుకున్నాయి.

Naresh.k
Published on: 12 Aug 2026 9:20 AM IST
Today Gold Rate
X

Today Gold Rate: మళ్లీ భగ్గుమన్న బంగారం, వెండి... 6 రోజుల్లో ఎంత పెరిగిందో తెలుసా..?

Today Gold Price: గత కొన్ని రోజులుగా కొంత శాంతించిన బంగారం, వెండి ధరలు మళ్లీ ఒక్కసారిగా పైపైకి దూసుకెళ్తున్నాయి. రెండు, మూడు రోజుల వ్యవధిలోనే ధరలు రికార్డు స్థాయికి చేరడంతో పసిడి ప్రియులు, సామాన్య వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

దేశ రాజధాని ఢిల్లీతో పాటు హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో పసిడి ధరలు రెండు నెలల గరిష్ఠ స్థాయిని తాకగా, వెండి సైతం అదే వేగంతో పయనిస్తోంది.ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ. 1,200 పెరిగి రూ. 1.57 లక్షల స్థాయికి చేరుకుంది.

కేవలం గడిచిన ఆరు రోజుల్లోనే 10 గ్రాముల బంగారంపై రూ. 9,800 మేర పెరగడం విశేషం . అటు వెండి ధర కూడా ఒక్కసారిగా పుంజుకుని కిలోకు రూ. 2,000 పెరిగి రూ. 2.42 లక్షల మార్కును తాకింది.హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లోనూ బంగారం ధర రూ. 1.57 లక్షలు, వెండి రూ. 2.42 లక్షల వద్ద ట్రేడవుతూ సరికొత్త రికార్డు సృష్టించాయి.

గత జూన్ 12న రూ. 1.56 లక్షలుగా ఉన్న పసిడి ధర, ఆగస్టు 3 నాటికి రూ. 1.47 లక్షలకు తగ్గి ఊరటనిచ్చింది. అయితే, ఆ సంతోషం ముచ్చటగా మూడు రోజులు కూడా నిలవకుండానే మళ్లీ పసిడి పరుగు లంకించుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 4,399 డాలర్లుగా ఉంటే, వెండి ఔన్సు ధర 65 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

పసిడి మళ్లీ ఈ స్థాయిలో పుంజుకోవడానికి ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలే కారణమని బులియన్ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. హర్మూజ్ జలసంధి తెరిచే అంశంలో కొనసాగుతున్న అనిశ్చితి కారణంతో క్రూడాయిల్ ధరలు భగ్గుమంటున్నాయి.

మార్కెట్‌లో అనిశ్చితి నెలకొన్న సమయంలో సురక్షిత ఇన్వెస్ట్‌మెంట్‌గా భావించే బంగారం, వెండి వైపు ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున మొగ్గు చూపడంతో డిమాండ్ పెరిగింది. జులై నెలకు సంబంధించిన అమెరికా వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణ గణాంకాలు త్వరలోనే వెలువడనున్నాయి.

ఈ డేటా ఆధారంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ తమ వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకోనుంది. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్‌తో పాటు మన దేశంలో పసిడి, వెండి రేట్లపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story