New CEOs: కొత్త సీఈఓల అన్వేషణలో హెచ్డిఎఫ్సి, ఉజ్జీవన్ బ్యాంకులు
New CEOs: హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఉజ్జీవన్ ఎస్ఎఫ్బితో పాటు కోటక్ మహీంద్రా, ఫినో బ్యాంకులు కొత్త ఎండి & సీఈఓల నియామక ప్రక్రియను ప్రారంభించాయి.
New CEOs: కొత్త సీఈఓల అన్వేషణలో హెచ్డిఎఫ్సి, ఉజ్జీవన్ బ్యాంకులు
New CEOs: దేశంలోని ప్రముఖ బ్యాంకులు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (SFB) తదుపరి వృద్ధి దశకు సంస్థలను నడిపించేందుకు కొత్త మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల కోసం అన్వేషణ ప్రారంభించాయి. ఇదే సమయంలో కోటక్ మహీంద్రా బ్యాంక్, ఫినో పేమెంట్స్ బ్యాంక్ కూడా తమ టాప్ పోస్టుల భర్తీ ప్రక్రియలో ముందడుగు వేసినట్లు సమాచారం.
ఫినో పేమెంట్స్ బ్యాంక్లో కొత్త సీఈఓ కోసం..
జీఎస్టీ చట్టాల ఉల్లంఘనలకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో ఫిబ్రవరిలో ఫినో పేమెంట్స్ బ్యాంక్ ఎండీ, సీఈఓ రిషి గుప్తా అరెస్టయ్యారు. ఈ పరిణామం తర్వాత బ్యాంక్లో కొత్త అధిపతి నియామక ప్రక్రియ ప్రారంభమైంది. గుప్తా అరెస్టు అనంతరం చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కేతన్ మర్చంట్ను తాత్కాలిక అధిపతిగా నియమించారు. ఆయన స్థానంలో కొత్త ఎండీ, సీఈఓను ఎంపిక చేసేందుకు బోర్డు ప్రక్రియ చేపట్టింది.
కోటక్ బ్యాంక్లోనూ వారసత్వ ప్రక్రియ
కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ, సీఈఓ అశోక్ వాస్వాని జూన్లో తన పదవీకాలాన్ని పొడిగించుకునే ప్రతిపాదన నుంచి తప్పుకున్నారు. ఆయన ప్రస్తుత మూడేళ్ల పదవీకాలం డిసెంబర్ 31, 2026తో ముగియనుంది. ఈ నేపథ్యంలో బ్యాంక్ తదుపరి ఎండీ, సీఈఓ పదవి కోసం కొంతమంది అంతర్గత అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసినట్లు సమాచారం.
బ్యాంకింగ్ రంగంలో ఉన్నత స్థాయి నియామకాల ప్రక్రియలో భాగంగా ముందుగా బ్యాంకు బోర్డు అర్హులైన అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేస్తుంది. అనంతరం ఎంపిక చేసిన పేర్లను ఆమోదం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కి పంపుతుంది. ఆర్బీఐ పరిశీలన, ఆమోదం తర్వాతే తుది నియామకం పూర్తవుతుంది.
ఉజ్జీవన్ ఎస్ఎఫ్బీలోనూ కొత్త అధిపతి కోసం..
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండీ, సీఈఓ సంజీవ్ నౌటియాల్ ఇటీవల ముందస్తు పదవీ విరమణ కోరడంతో ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మాజీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అయిన నౌటియాల్.. జూలై 1, 2024 నుంచి అమల్లోకి వచ్చేలా మూడేళ్ల కాలానికి ఉజ్జీవన్ SFB ఎండీ, సీఈఓగా నియమితులయ్యారు.
హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కీలకంగా మారిన వారసత్వ ప్రక్రియ
హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కొత్త నాయకత్వం కోసం అన్వేషణ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. గత నెలలో ప్రస్తుత ఎండీ, సీఈఓ శశిధర్ జగదీషన్ పునర్నియామక ప్రక్రియ నుంచి తప్పుకున్నారు. 61 ఏళ్ల జగదీషన్ తన ప్రస్తుత పదవీకాలం అక్టోబర్ 26తో ముగిసిన తర్వాత మరోసారి నియామకం కోరుకోవడం లేదని నిర్ణయించుకున్నారు.
జగదీషన్ దాదాపు మూడు దశాబ్దాలుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ఆయన తప్పుకోనున్న నేపథ్యంలో దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన హెచ్డిఎఫ్సి బ్యాంక్కు తదుపరి నాయకత్వం ఎవరు వహిస్తారనే అంశంపై బ్యాంకింగ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.




