ప్రపంచ దేశాలకు UPI సేవలు.. భారత్ కీలక అడుగులు

UPI, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో గ్లోబల్ సౌత్ దేశాల్లో ఫిన్‌టెక్ సేవలను విస్తరించేందుకు భారత్ కీలక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 10 Sept 2026 12:20 AM IST
UPI Global Expansion
X

 UPI Global Expansion

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI), డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (DPI) వంటి ఫిన్‌టెక్ రంగంలోని భారత అనుభవాన్ని ప్రపంచ మార్కెట్లకు విస్తరించాల్సిన అవసరం ఉందని వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ అన్నారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాల్లో భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలకు మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్లో ఆయన మాట్లాడుతూ.. వేగంగా విస్తరిస్తున్న ప్రపంచ ఫిన్‌టెక్ సేవల వాణిజ్యంలో భారత్ మరింత వాటాను సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ఫిన్‌టెక్ సేవల ఎగుమతుల్లో భారత్ 10 శాతం వాటాను సాధించగలిగితే, ప్రస్తుతం ఉన్న సుమారు 8 బిలియన్ డాలర్ల ఎగుమతులు 60-80 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

23 దేశాలతో DPI సహకారం

భారత్ ఇప్పటికే తన డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనుభవాన్ని ఇతర దేశాలకు విస్తరించే దిశగా పనిచేస్తోందని అగర్వాల్ తెలిపారు. ఇప్పటివరకు సుమారు 23 దేశాలతో DPI సహకారానికి సంబంధించి అవగాహన ఒప్పందాలు (MoUs) కుదుర్చుకున్నట్లు వెల్లడించారు.

వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరిపే సమయంలో భాగస్వామ్య దేశాలతో చెల్లింపు వ్యవస్థలను అనుసంధానించే అంశాన్ని కూడా భారత్ పరిశీలిస్తోందన్నారు. ముఖ్యంగా భారతీయ ప్రవాసుల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాల్లో పేమెంట్ సిస్టమ్స్‌ను అనుసంధానం చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు.

చౌకగా ఆర్థిక సేవలు

రెమిటెన్సులు, రుణాలు వంటి ఆర్థిక సేవల ఖర్చును తగ్గించడంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషించగలదని అగర్వాల్ అన్నారు. వివిధ దేశాల మధ్య పరస్పరం పనిచేసే డిజిటల్ పేమెంట్ వ్యవస్థలను విస్తరించడం ద్వారా ఆర్థిక సేవలను మరింత చౌకగా, సులభంగా అందుబాటులోకి తీసుకురావచ్చని పేర్కొన్నారు.

భారత్ తన UPI, ఫిన్‌టెక్ సామర్థ్యాలను అంతర్జాతీయ స్థాయిలో విస్తరించగలిగితే.. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాల్లో డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల రంగంలో భారత్‌కు కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉందని ఆయన వివరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story