Petrol Diesel Price: ముదిరిన యుద్ధం.. గ్యాస్ ధరలు పెరిగాయి.. పెట్రోల్ రేట్లు కూడా పెరుగుతాయా?

Petrol Diesel Price: మధ్య ప్రాచ్యంలో యుద్ధ నేపథ్యంలో తలెత్తిన సంక్షోభంతో ఇప్పటికే వంట గ్యాస్ ధరలు పెరిగాయి. మరి పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయా?

KVD Varma
Published on: 10 March 2026 7:12 PM IST
Petrol Diesel Price: మధ్య ప్రాచ్యంలో యుద్ధ నేపథ్యంలో తలెత్తిన సంక్షోభంతో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయా?
X

Petrol Diesel Price

Petrol Diesel Price: ఇరాన్- ఇజ్రాయేల్ మధ్య యుద్ధం ముదిరింది. ఇప్పుడప్పుడే ఇది ఆగే సూచనలు కనిపించడం లేదు. ఈ యుద్ధం కారణంగా మధ్య ప్రాచ్యంలో పరిస్థితి గందరగోళంగా తయారైంది. ముఖ్యంగా క్రూడాయిల్, గ్యాస్ సప్లై చెయిన్ దెబ్బతింది. ఇది భారతదేశంపై ప్రభావాన్ని చూపించడం మొదలైంది. హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో తీవ్రమైన ఇబ్బందులు తలెత్తాయి. ప్రస్తుతం వంట గ్యాస్ సమస్య పెద్దదిగా మారింది.

దీంతో వంటగ్యాస్ ధరలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆ పెరిగిన ధరలు అమలులోకి కూడా వచ్చేశాయి. దీంతో పాటు వంట గ్యాస్ పక్కదారి పట్టకుండా పటిష్ట చర్యలు తీసుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే గ్యాస్ బుకింగ్ పరిధిని 25 రోజులకు పెంచింది. మరోవైపు గ్యాస్ ఉత్పత్తిని 10% పెంచాలని కంపెనీలను ఆదేశించింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ సామాన్యులకు వంట గ్యాస్ కొరత రాకుండా చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

ఇదిలా ఉంటే, క్రూడాయిల్ సరఫరాలో కూడా పెద్ద ఎత్తున అంతరాయం ఏర్పడింది. అయితే, ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న పెట్రోల్ ధరలు కూడా పెరుగుతాయా? అనేది. ఎందుకంటే, ఇరాన్ ఆంక్షలు విధించడం వల్ల ప్రపంచ ముడి చమురు ధరలు బ్యారెల్‌కు $100 దాటి పెరిగాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్ ధరలు కూడా పెరగవచ్చనే ఆందోళన అందరిలో నెలకొంది.

ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ, పెట్రోల్, డీజిల్ ధరలలో పెంపుదల వెంటనే ఉండదని ప్రభుత్వ ఉన్నత వర్గాలు ధృవీకరించాయి. అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, రిటైల్ ఇంధన ధరలను పెంచే తక్షణ ప్రణాళికలు ప్రభుత్వానికి లేవని ఉన్నత అధికారులు వార్తా సంస్థ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు తెలిపారు. చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రస్తుతానికి అదనపు ఖర్చు భారాన్ని భరిస్తున్నాయి. ప్రపంచ సరఫరా పరిమితుల నేపథ్యంలో అవసరమైన ఇంధన ధరలను స్థిరీకరించడానికి, పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత సమయంలో వినియోగదారుల రక్షణకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత ను ఇది సూచిస్తోంది

కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి సంభావ్య కొరత లేదా ఇంధన అభద్రత గురించి ప్రజల ఆందోళనలపై స్పందించారు. ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. “భారతదేశంలో ఇంధన కొరత లేదు. మన ఇంధన వినియోగదారులకు ఆందోళన చెందడానికి ఎటువంటి కారణం లేదు.” అని ఆయన అందులో పేర్కొన్నారు.


ప్రపంచ ముడి చమురు మార్కెట్లలో అస్థిరత ఉన్నప్పటికీ, భారతదేశంలో రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలు ఇటీవలి సంవత్సరాలలో స్థిరంగా ఉంటూ వస్తున్నాయి. ద్రవ్యోల్బణ ఒత్తిడిని తగ్గించడానికి కేంద్రం, అనేక రాష్ట్రాలు ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్‌ను తగ్గించిన తరువాత మే 2022 నుండి ధరల్లో పెద్దగా మార్పులు రాలేదు.

ఈరోజు అంటే మార్చి 10న, చాలా నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు మారలేదు. ఢిల్లీలో పెట్రోల్ లీటరుకు ₹94.77, డీజిల్ ₹87.67. ముంబై పెట్రోల్ ₹103.50, డీజిల్ ₹90.03 వద్ద ఉండగా, హైదరాబాద్ మెట్రోలలో పెట్రోల్ ధర ₹107.46గా ఉంది.

పాట్నా, అహ్మదాబాద్‌లలో స్వల్ప పెరుగుదల కనిపించగా, లక్నోలో స్వల్ప తగ్గుదల నమోదైంది. బెంగళూరు, చెన్నై, పూణే, థానేలలో ధరలు స్వల్పంగా మాత్రమే కదిలాయి, ఇది రిటైల్ ఇంధన రేట్లలో నిరంతర స్థిరత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

OMCలు ఏమంటున్నాయి..

ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా ప్రభుత్వ వైఖరినే వెల్లడిస్తోంది. ప్రస్తుత భౌగోళిక రాజకీయ అంతరాయాలు ప్రపంచ ఇంధన సరఫరాను ప్రభావితం చేస్తున్న దృష్ట్యా, LPG ఉత్పత్తిని పెంచడానికి, దేశీయ వినియోగదారులకు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు వంటి ముఖ్యమైన రంగాలకు దాని లభ్యతకు ప్రాధాన్యత ఇవ్వడానికి చర్యలు తీసుకున్నట్టు చెబుతోంది.

KVD Varma

KVD Varma

Next Story