Jio IPO: జియో ఐపీఓకు రంగం సిద్ధం.. పెట్టుబ‌డిదారులు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు?

Jio IPO: భారతీయ స్టాక్ మార్కెట్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఓల్లో ఒకటైన జియో ఐపీఓపై కీలక అప్‌డేట్ వచ్చింది.

Mokshith
Published on: 21 Jun 2026 3:31 PM IST
Jio IPO
X

Jio IPO: జియో ఐపీఓకు రంగం సిద్ధం.. పెట్టుబ‌డిదారులు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు?

Jio IPO: భారతీయ స్టాక్ మార్కెట్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఓల్లో ఒకటైన జియో ఐపీఓపై కీలక అప్‌డేట్ వచ్చింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 49వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)లో జియో ప్లాట్‌ఫార్మ్స్ ఐపీఓకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైనట్లు ప్రకటించారు. దీంతో పెట్టుబడిదారుల దృష్టి ఇప్పుడు జియో ఐపీఓపైనే ఉంది.

జియో ఐపీఓ కోసం 27 కోట్ల కొత్త షేర్లు

జియో ప్లాట్‌ఫార్మ్స్ బోర్డు ఐపీఓ ముసాయిదా పత్రాలకు ఆమోదం తెలిపింది. కంపెనీ ఇప్పుడు మార్కెట్ నియంత్రణ సంస్థ అయిన సెబీ (SEBI)కి డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) సమర్పించనుంది. ఈ ఐపీఓలో భాగంగా సుమారు 27 కోట్ల కొత్త షేర్లను జారీ చేయాలని సంస్థ నిర్ణయించింది. అయితే ఐపీఓ ద్వారా ఎంత మొత్తాన్ని సమీకరించాలనుకుంటున్నారు అనే పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు.

ఐపీఓ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

జియో ఐపీఓ కోసం పెట్టుబడిదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నప్పటికీ, ఇప్పటివరకు అధికారిక ప్రారంభ తేదీని ప్రకటించలేదు. ప్రస్తుతం కేవలం ప్రాథమిక ప్రక్రియ మాత్రమే మొదలైంది. సెబీకి డాక్యుమెంట్లు సమర్పించిన తర్వాత వాటి పరిశీలన పూర్తవ్వాలి. అనంతరం అనుమతులు లభించిన తర్వాతే ఐపీఓ ప్రారంభ తేదీని కంపెనీ ప్రకటించే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఏ ప్రక్రియ కొనసాగుతోంది?

ఐపీఓ ప్రారంభానికి ముందు కంపెనీ DRHP దాఖలు చేయాలి. ఆ తర్వాత సెబీ దానిని పరిశీలించి అనుమతి ఇవ్వాలి. ఈ ప్రక్రియలో అవసరమైతే కంపెనీ నుంచి అదనపు వివరాలు కూడా కోరే అవకాశం ఉంటుంది. సాధారణంగా భారీ స్థాయి ఐపీఓల విషయంలో ఈ మొత్తం ప్రక్రియ పూర్తవ్వడానికి రెండు నుంచి మూడు నెలల సమయం పట్టవచ్చు. అందువల్ల జియో ఐపీఓ కోసం పెట్టుబడిదారులు మరికొంతకాలం వేచి చూడాల్సి రావచ్చు.

ప్రైస్ బ్యాండ్‌పై ఇంకా స్పష్టత లేదు

ఐపీఓలో ఒక్కో షేర్ ధర ఎంత ఉండబోతోందనే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అలాగే ప్రైస్ బ్యాండ్, కనీస పెట్టుబడి మొత్తం, రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించే షేర్ల సంఖ్య వంటి కీలక వివరాలు కూడా ప్రస్తుతం అందుబాటులో లేవు. సెబీ అనుమతుల తర్వాత ఈ వివరాలను కంపెనీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

రిలయన్స్ షేర్ హోల్డర్లకు ప్రత్యేక ప్రయోజనం?

ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు కలిగి ఉన్న పెట్టుబడిదారులకు జియో ఐపీఓలో ప్రత్యేక అవకాశం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా పెద్ద కంపెనీల ఐపీఓల్లో ప్రస్తుత షేర్ హోల్డర్ల కోసం ప్రత్యేక కోటాను కేటాయిస్తారు. అదే విధానం జియో ఐపీఓలో కూడా అమలైతే రిలయన్స్ షేర్ హోల్డర్లకు అదనపు ప్రయోజనం దక్కే అవకాశం ఉంది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story