LPG Gas: గ్యాస్ వినియోగదారులకు లాస్ట్ ఛాన్స్..ఈ రోజు రాత్రికల్లా ఈ పని చేయకపోతే సబ్సిడీ బంద్

LPG Gas: ఏజెన్సీల చుట్టూ తిరిగే పని లేకుండా ఫోన్ ద్వారా ఈ రోజు లోపే ఈ-కేవైసీ ప్రక్రియను ముగించడం శ్రేయస్కరం.

CR Reddy
Published on: 16 Aug 2026 9:04 AM IST
LPG Gas
X

LPG Gas

LPG Gas: గ్యాస్ సిలిండర్ ఉపయోగిస్తున్న వినియోగదారులు వెంటనే అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది. ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి ఈరోజే ఆఖరి అవకాశంగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే గ్యాస్ సబ్సిడీని పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే ఏం జరుగుతుంది?

నిర్ణీత గడువులోగా ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోతే గ్యాస్ కనెక్షన్ వెంటనే రద్దు కాకపోవచ్చు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే నగదు సబ్సిడీ నిలిచిపోతుంది. మళ్లీ ఈ-కేవైసీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసే వరకు వినియోగదారులు సాధారణ వాణిజ్య ధరలకు సిలిండర్లు కొనుగోలు చేయాల్సి వస్తుంది. పన్ను రాయితీలు కూడా పొందే అర్హతను కోల్పోతారు. ఆందోళన చెందకుండా వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయడం మంచిది.

ఇంట్లోనే ఫోన్ ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేయడం ఎలా?

* గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా సులభంగా ఈ-కేవైసీ పూర్తి చేయవచ్చు.

* ముందుగా మీరు ఉపయోగిస్తున్న గ్యాస్ కంపెనీ అధికారిక మొబైల్ యాప్‌ను ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.

* యాప్‌తో పాటు గూగుల్ ప్లేస్టోర్ నుంచి Aadhaar FaceRD యాప్‌ను కూడా ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.

* మీ మొబైల్ నంబర్‌తో యాప్‌లోకి లాగిన్ అయిన తర్వాత స్క్రీన్‌పై కనిపించే e-KYC ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

* ఫేస్ స్కానింగ్ కోసం కెమెరా యాక్సెస్ ఇచ్చి మీ ముఖాన్ని సరిగ్గా స్కాన్ చేయాలి.

* స్కాన్ పూర్తయిన వెంటనే మీ ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తయినట్లు సందేశం వస్తుంది.

ఫోన్‌లో ప్రక్రియ పూర్తి కాకపోతే ఏం చేయాలి?

మొబైల్ యాప్‌లో సాంకేతిక సమస్యలు ఎదురైతే సమీపంలోని ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్ లేదా గ్యాస్ ఏజెన్సీని నేరుగా సంప్రదించాలి. ఏజెన్సీకి వెళ్లేటప్పుడు మీ గుర్తింపు కార్డుతో పాటు గ్యాస్ కనెక్షన్ పుస్తకాన్ని తప్పనిసరిగా తీసుకెళ్లాలి. మీ గుర్తింపు కార్డుకు మొబైల్ నంబర్ లింక్ అయి ఉండటం ముఖ్యం. ఏజెన్సీ ప్రతినిధులు మీ బయోమెట్రిక్ వివరాలను పరిశీలించి ముఖ గుర్తింపు ద్వారా ప్రక్రియను పూర్తి చేస్తారు.

గడువు పెంపు పుకార్లు.. అసలు నిజం ఇదే

గ్యాస్ ఈ-కేవైసీ గడువును ఆగస్టు 23 వరకు పొడిగించినట్లు సామాజిక మాధ్యమాల్లో సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ప్రచారంపై గ్యాస్ సరఫరా కంపెనీల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇప్పటికే ఈ-కేవైసీ పూర్తి చేసిన వినియోగదారులు మళ్లీ చేయాల్సిన అవసరం లేదు. కేవలం పెండింగ్‌లో ఉన్న వినియోగదారులు మాత్రమే సబ్సిడీ ప్రయోజనాలు కోల్పోకుండా ఉండటానికి వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story