Milky Mist IPO: ఆగస్టు తొలి వారంలో మిల్కీ మిస్ట్ ఐపీఓ.. రూ.1,553 కోట్లు లక్ష్యం
ఆగస్టు తొలి వారంలో మిల్కీ మిస్ట్ ఐపీఓ వచ్చే అవకాశం ఉంది. రూ.1,553 కోట్ల సమీకరణతో పాటు తయారీ విస్తరణకు నిధులు వినియోగించనుంది.
Milky Mist IPO
దేశంలోని ప్రముఖ విలువ ఆధారిత పాల ఉత్పత్తుల తయారీ సంస్థ మిల్కీ మిస్ట్ డెయిరీ ఫుడ్ లిమిటెడ్ ఆగస్టు తొలి వారంలో ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO)ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని కంపెనీ వ్యవహారాలకు సంబంధించిన వర్గాలు వెల్లడించాయి. ఈ ఐపీఓ విజయవంతమైతే, భారత డెయిరీ రంగంలో ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద ఐపీఓగా నిలిచే అవకాశం ఉంది.
ప్రస్తుతం డెయిరీ రంగంలో పరాగ్ మిల్క్ ఫుడ్స్, హాట్సన్ అగ్రో ప్రొడక్ట్స్, డోడ్లా డెయిరీ వంటి సంస్థలు స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మిల్కీ మిస్ట్ ప్రవేశం పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇప్పటికే ఈ ఏడాది మే నెలలో టెమాసెక్ హోల్డింగ్స్ అనుబంధ సంస్థ జాంగ్సాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కంపెనీ ప్రీ-ఐపీఓ దశలో రూ.482 కోట్ల పెట్టుబడిని సమీకరించింది. ఒక్కో షేరును రూ.139.76 ధరకు విక్రయించడంతో కంపెనీ విలువ సుమారు రూ.9,300 కోట్లుగా అంచనా వేశారు.
ఇప్పుడు ఐపీఓ ద్వారా మొత్తం రూ.1,553 కోట్ల నిధులను సమీకరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో కొత్త ఈక్విటీ షేర్ల జారీ (Fresh Issue)తో పాటు ప్రమోటర్ల వాటా విక్రయం (Offer for Sale - OFS) కూడా ఉండనుంది. అంతకుముందు కంపెనీ దాఖలు చేసిన డ్రాఫ్ట్ పత్రాల ప్రకారం ఐపీఓ పరిమాణం రూ.2,035 కోట్లుగా ఉండగా, ప్రస్తుతం దాన్ని తగ్గించినట్లు తెలుస్తోంది.
ఐపీఓ ద్వారా లభించే నిధులను కంపెనీ అప్పుల చెల్లింపుతో పాటు తమిళనాడులోని పెరుందురై తయారీ కేంద్ర విస్తరణ, ఆధునికీకరణ కోసం వినియోగించనుంది. ఇందులో వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్, యోగర్ట్, క్రీమ్ చీజ్ తయారీ యూనిట్ల ఏర్పాటు కూడా ఉంది.
అదనంగా దేశవ్యాప్తంగా కోల్డ్చైన్ మౌలిక వసతులను బలోపేతం చేయడానికి విజి కూలర్లు, ఐస్క్రీమ్ ఫ్రీజర్లు, చాక్లెట్ కూలర్ల ఏర్పాటు కోసం కూడా నిధులను వినియోగించనుంది. మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనున్నట్లు సమాచారం.
తమిళనాడులోని ఈరోడ్ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించిన మిల్కీ మిస్ట్ ప్రస్తుతం విలువ ఆధారిత పాల ఉత్పత్తుల తయారీలో దేశంలోని ప్రముఖ బ్రాండ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది.




