Patanjali: మరో రంగంలోకి అడుగుపెట్టిన పతాంజలి.. రూ. 4500 కోట్ల భారీ డీల్
Patanjali: పతంజలి ఆయుర్వేద్ ఇప్పుడు ఇన్సూరెన్స్ రంగంలోకి అడుగుపెడుతోంది.
Patanjali: మరో రంగంలోకి అడుగుపెట్టిన పతాంజలి.. రూ. 4500 కోట్ల భారీ డీల్
Patanjali: పతంజలి ఆయుర్వేద్ ఇప్పుడు ఇన్సూరెన్స్ రంగంలోకి అడుగుపెడుతోంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) నుంచి అనుమతి లభించడంతో, సుమారు రూ.4,500 కోట్ల విలువైన డీల్ పూర్తి కానుంది. ఈ ఒప్పందం ద్వారా పతంజలి తొలిసారిగా ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలోకి ప్రవేశిస్తోంది.
IRDAI ఆమోదంతో డీల్కు గ్రీన్ సిగ్నల్
మార్చిలో ప్రకటించిన ఈ కొనుగోలు ఒప్పందానికి ఇప్పుడు IRDAI తుది ఆమోదం ఇచ్చింది. దీంతో బాబా రాందేవ్కు చెందిన పతంజలి ఆయుర్వేద్, మ్యాగ్మా జనరల్ ఇన్సూరెన్స్లో 73.6 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఇక ధర్మపాల్ సత్యపాల్ (DS) గ్రూప్ మరో 24.5 శాతం వాటాను కో-ఇన్వెస్టర్గా సొంతం చేసుకోనుంది.
ఈ డీల్కు ముందు మ్యాగ్మా జనరల్ ఇన్సూరెన్స్లో అధిక వాటా ఇతర పెట్టుబడిదారుల చేతిలో ఉండేది. ఇప్పుడు పతంజలి ప్రధాన ప్రమోటర్గా మారనుంది.
మ్యాగ్మా జనరల్ ఇన్సూరెన్స్ పనితీరు ఎలా ఉంది?
గత కొన్నేళ్లుగా మ్యాగ్మా జనరల్ ఇన్సూరెన్స్ మంచి వృద్ధిని నమోదు చేసింది. 2021 నుంచి 2025 ఆర్థిక సంవత్సరాల మధ్య కంపెనీ గ్రాస్ డైరెక్ట్ ప్రీమియం ఏటా సగటున 22 శాతం వృద్ధితో రూ.3,334 కోట్లకు చేరింది. ఇదే కాలంలో దేశంలోని జనరల్ ఇన్సూరెన్స్ రంగం సగటు వృద్ధి 10 శాతం మాత్రమే ఉండటం విశేషం. 2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నష్టాల నుంచి బయటపడి రూ.1 కోటి లాభం నమోదు చేసింది. అంతకుముందు ఏడాది రూ.141 కోట్ల నష్టాన్ని చవిచూసింది. 2026 ఆర్థిక సంవత్సరంలోని తొలి తొమ్మిది నెలల్లోనే రూ.27 కోట్ల నికర లాభం నమోదు చేసింది.
పతంజలి పెట్టుబడులతో మరింత విస్తరణ
IRDAI విధించిన షరతుల ప్రకారం పతంజలి మ్యాగ్మా జనరల్ ఇన్సూరెన్స్కు ప్రధాన ప్రమోటర్గా కొనసాగుతుంది. కంపెనీ అభివృద్ధి, ఆర్థిక బలం కోసం అవసరమైన పెట్టుబడులను కూడా కొనసాగించనుంది. DS గ్రూప్ ఈ కొనుగోలులో భాగస్వామ్య పెట్టుబడిదారుగా వ్యవహరిస్తుంది. ప్రస్తుతం కంపెనీ సాల్వెన్సీ మార్జిన్ 1.81 రెట్లు ఉండగా, ఇది నియంత్రణ సంస్థ నిర్దేశించిన 1.50 రెట్ల కనీస ప్రమాణం కంటే ఎక్కువగా ఉంది. అంటే కంపెనీ ఆర్థికంగా బలమైన స్థితిలో ఉందని చెప్పవచ్చు.
గ్రామీణ ప్రాంతాలపై పతంజలి ప్రత్యేక దృష్టి
మ్యాగ్మా జనరల్ ఇన్సూరెన్స్ ప్రస్తుతం 70కు పైగా ఇన్సూరెన్స్ ఉత్పత్తులను అందిస్తోంది. ఆరోగ్యం, వాహనాలు, ఆస్తులు, వ్యాపారాలు వంటి పలు విభాగాలకు సంబంధించిన బీమా సేవలను అందిస్తోంది. ఈ కంపెనీ ఉత్పత్తులను మరింత విస్తరించడంతో పాటు, ముఖ్యంగా సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో సేవలను పెంచాలని పతంజలి లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా పతంజలికి బలమైన పంపిణీ వ్యవస్థ ఉంది. దాదాపు రెండు లక్షల విక్రయ కేంద్రాలు, 250 పతంజలి మెగా స్టోర్లు, అలాగే ప్రముఖ రిటైల్ చైన్ల ద్వారా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఇదే నెట్వర్క్ను ఉపయోగించి ఇన్సూరెన్స్ సేవలను కూడా ప్రజలకు చేరువ చేయాలని కంపెనీ యోచిస్తోంది.
పతంజలి ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో కొత్త అధ్యాయం
ఈ కొనుగోలు ద్వారా పతంజలి ఎఫ్ఎంసీజీ వ్యాపారానికే పరిమితం కాకుండా ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో కూడా అడుగుపెట్టింది. బలమైన బ్రాండ్, విస్తృత పంపిణీ వ్యవస్థ, గ్రామీణ మార్కెట్లో ఉన్న పట్టు ఆధారంగా మ్యాగ్మా జనరల్ ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని మరింత విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ డీల్ భారత ఇన్సూరెన్స్ రంగంలో కీలక పరిణామంగా భావిస్తున్నారు.




