PM Kisan: తగ్గిపోతున్న పీఎం కిసాన్ రైతుల సంఖ్య.. వెంటనే ఈ పని చేయండి లేదంటే..!
పీఎం కిసాన్ 23వ విడత నిధులు జూన్ లేదా జూలైలో విడుదల కానున్నాయి.
PM Kisan
Farmer Schemes: దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే 22వ విడత నిధులను విజయవంతంగా విడుదల చేసిన ప్రధాని మోదీ, త్వరలోనే 23వ విడత నిధులను నేరుగా రైతుల ఖాతాల్లోకి బటన్ నొక్కి జమ చేయనున్నారు. అయితే, ఈసారి డబ్బులు మీ అకౌంట్లోకి రావాలంటే ఒక నిబంధనను మాత్రం కచ్చితంగా పాటించాల్సిందే.
ఎప్పుడొస్తుంది 23వ విడత?
మార్చి 13న గువాహటిలో జరిగిన సభలో ప్రధాని మోదీ 22వ విడత నిధులను విడుదల చేశారు. సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ నిధులు విడుదలవుతాయి. ఈ క్రమంలో 23వ విడత నగదు జూన్ లేదా జూలై నెలల్లో లబ్దిదారుల అకౌంట్లలో జమ అయ్యే అవకాశం ఉందని సమాచారం. రానున్న విడత సొమ్ము పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇది చేయని పక్షంలో మీ అకౌంట్లో నగదు జమ కాదు. ఈకేవైసీ పూర్తి చేయడానికి మూడు సులభమైన మార్గాలు ఉన్నాయి:
ఈకేవైసీ ఎలా చేయాలంటే..?
పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ద్వారా స్వయంగా చేసుకోవచ్చు. పీఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా సులభంగా పూర్తి చేయవచ్చు. సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా పూర్తి చేయవచ్చు. దీనితో పాటు మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు లింక్ అయి ఉండటం, డీబీటీ ఎనేబుల్ అయి ఉండటం కూడా అంతే ముఖ్యం.
తగ్గుతున్న లబ్దిదారుల సంఖ్య.. ఎందుకంటే?
కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రీ-వెరిఫికేషన్ ప్రక్రియను చేపడుతోంది. దీనివల్ల అనర్హుల పేర్లు జాబితా నుంచి తొలగిపోతున్నాయి. ఆదాయపు పన్ను చెల్లిస్తూ ఈ పథకం ప్రయోజనం పొందుతున్న వారిని ఐటీ శాఖ డేటా ఆధారంగా తొలగిస్తున్నారు. ఫిబ్రవరి 1, 2019 తర్వాత భూమి కొనుగోలు చేసిన వారికి ఈ పథకం వర్తించదు. కుటుంబంలో కేవలం ఒక్కరికి మాత్రమే ఈ ఆర్థిక సాయం అందుతుంది. గణాంకాల ప్రకారం, 2025-26 ఏప్రిల్-జులై సమయంలో 9.71 కోట్లుగా ఉన్న లబ్దిదారుల సంఖ్య, డిసెంబర్-మార్చి నాటికి 9.46 కోట్లకు తగ్గింది.




