ఇళ్లపై సౌర విద్యుత్‌.. 50 లక్షలు దాటిన పీఎం సూర్య ఘర్‌

పీఎం సూర్య ఘర్‌ పథకం కింద 50.06 లక్షల ఇళ్లకు రూఫ్‌టాప్‌ సౌర విద్యుత్‌ చేరింది. ఇప్పటివరకు 14.8 గిగావాట్ల సామర్థ్యం ఏర్పాటు చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 Aug 2026 4:20 AM IST
PM Surya Ghar Yojana
X

PM Surya Ghar Yojana

దేశంలో పైకప్పులపై సౌర విద్యుత్‌ వ్యవస్థల ఏర్పాటును ప్రోత్సహిస్తున్న పీఎం సూర్య ఘర్‌ పథకం మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 50.06 లక్షలకుపైగా కుటుంబాలు రూఫ్‌టాప్‌ సౌర విద్యుత్‌ సదుపాయాన్ని పొందినట్లు కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది.

పథకం ప్రారంభమైన రెండేళ్లలోనే ఈ స్థాయికి చేరుకోవడం విశేషమని కేంద్రం తెలిపింది. అంతకుముందు పదేళ్లలో దేశవ్యాప్తంగా నమోదైన 7.94 లక్షల పైకప్పు సౌర విద్యుత్‌ ఏర్పాట్లతో పోలిస్తే.. పీఎం సూర్య ఘర్‌ పథకం అమలు వేగం గణనీయంగా పెరిగిందని పేర్కొంది. రూ.75,021 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద రూఫ్‌టాప్‌ సౌర విద్యుత్‌ కార్యక్రమంగా కొనసాగుతోందని తెలిపింది.

రోజుకు 16 వేలకు పైగా ఇన్‌స్టాలేషన్లు

పీఎం సూర్య ఘర్‌ పథకం కింద సౌర విద్యుత్‌ వ్యవస్థల ఏర్పాట్లు గత తొమ్మిది నెలల్లో 3.2 రెట్లు పెరిగినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2025 అక్టోబర్‌లో రోజుకు సగటున 5,038 ఇన్‌స్టాలేషన్లు ఉండగా.. 2026 జులై నాటికి రోజుకు దాదాపు 16,328కు చేరినట్లు తెలిపింది.

2026 జులైలోనే 5.06 లక్షల కుటుంబాల ఇళ్లపై సౌర విద్యుత్‌ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. పథకం ప్రారంభమైన తర్వాత ఒక నెలలో నమోదైన అత్యధిక ఇన్‌స్టాలేషన్లు ఇవేనని కేంద్రం పేర్కొంది.

రూ.28 వేల కోట్లకు పైగా సబ్సిడీ

పథకం అమలుకు ఊతమిచ్చేందుకు ఇప్పటివరకు రూ.28,024 కోట్ల సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు కేంద్రం తెలిపింది. దీంతో దాదాపు 19 లక్షల కుటుంబాలకు విద్యుత్‌ బిల్లులు సున్నాగా మారినట్లు వెల్లడించింది.

అదనపు విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించడం ద్వారా 12 లక్షలకుపైగా కుటుంబాలు 2025 ఆర్థిక సంవత్సరంలో కలిపి రూ.421 కోట్ల ఆదాయం పొందినట్లు పేర్కొంది. విద్యుత్‌ను తిరిగి గ్రిడ్‌కు విక్రయించిన కుటుంబాలకు సగటున ఏడాదికి రూ.3,500 వరకు అదనపు ఆదాయం లభించినట్లు తెలిపింది.

తక్కువ ఆదాయ కుటుంబాలకు కూడా ప్రయోజనం

యుటిలిటీ లెడ్‌ అగ్రిగేషన్‌ విధానం ద్వారా నాలుగు రాష్ట్రాల్లో పీఎంఏవై, బీపీఎల్‌, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 1.6 లక్షల సౌర విద్యుత్‌ వ్యవస్థలు ఏర్పాటు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ విధానాన్ని మరో 12 రాష్ట్రాల్లో అమలు చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపింది. తక్కువ ఆదాయ వర్గాల కుటుంబాలు కూడా పైకప్పు సౌర విద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చుకోవడంతో పాటు రాష్ట్రాలపై విద్యుత్‌ సబ్సిడీ భారం తగ్గించేందుకు ఈ విధానం ఉపయోగపడుతోందని పేర్కొంది.

5.75 శాతం వడ్డీకే రుణాలు

పథకం కింద రాయితీ వడ్డీతో రుణాలు కూడా అందిస్తున్నారు. రెపో రేటుకు అదనంగా 50 బేసిస్‌ పాయింట్లను కలిపి 5.75 శాతం వడ్డీ రేటుతో రుణాలు మంజూరు చేస్తున్నారు. ఇప్పటివరకు 21.87 లక్షల మంది దరఖాస్తుదారులకు రుణాలు మంజూరయ్యాయి. వీటిలో 17.5 లక్షల సౌర విద్యుత్‌ వ్యవస్థలు రుణ సాయంతో ఇప్పటికే పూర్తయ్యాయి.

జన్‌ సమర్థ్‌ అనుసంధానం ద్వారా రుణ ప్రక్రియను కాగిత రహితంగా మార్చినట్లు కేంద్రం తెలిపింది. సబ్సిడీని 15 రోజుల్లో విడుదల చేసేందుకు పీఎఫ్‌ఎంఎస్‌ అనుసంధానం, 80కుపైగా డిస్కమ్‌లతో అనుసంధానం ద్వారా దరఖాస్తుల ప్రక్రియను సులభతరం చేసినట్లు పేర్కొంది.

14.8 గిగావాట్ల సౌర విద్యుత్‌ సామర్థ్యం

పీఎం సూర్య ఘర్‌ పథకం కింద ఇప్పటివరకు మొత్తం 14.8 గిగావాట్ల రూఫ్‌టాప్‌ సౌర విద్యుత్‌ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ పథకంలో 34,219 మంది విక్రేతలు నమోదై ఉండగా.. వారిలో 29,469 మంది ప్రస్తుతం క్రియాశీలంగా సేవలందిస్తున్నారు.

సౌర విద్యుత్‌ రంగంలో నైపుణ్యాలను పెంచేందుకు చేపట్టిన శిక్షణ కార్యక్రమాల ద్వారా 2.32 లక్షలకుపైగా మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపింది. వినియోగదారులకు విక్రేతల పనితీరును అంచనా వేసే అవకాశం కల్పించేందుకు స్టార్‌ రేటింగ్‌ విధానాన్ని కూడా తీసుకొచ్చింది.

పీఎం సూర్య ఘర్‌ పథకాన్ని పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో అమలు చేస్తున్నారు. సబ్సిడీ, రుణాలు, నెట్‌ మీటరింగ్‌, డిస్కమ్‌ల ప్రక్రియలను డిజిటల్‌ విధానంలో అనుసంధానం చేయడంతో సౌర విద్యుత్‌ వ్యవస్థల ఏర్పాటును మరింత వేగవంతం చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story