Post Office: కాస్త ఓపిక ఉంటే చాలు.. మీ డబ్బులు ఇట్టే డబుల్ అవుతాయి

Post Office: పెట్టుబడి పెట్టాలనుకునే చాలా మంది తమ డబ్బు సురక్షితంగా ఉండటంతో పాటు మంచి రాబడి కూడా రావాలని కోరుకుంటారు.

Mokshith
Published on: 18 July 2026 2:04 PM IST
Post Office
X

Post Office: కాస్త ఓపిక ఉంటే చాలు.. మీ డబ్బులు ఇట్టే డబుల్ అవుతాయి

Post Office: పెట్టుబడి పెట్టాలనుకునే చాలా మంది తమ డబ్బు సురక్షితంగా ఉండటంతో పాటు మంచి రాబడి కూడా రావాలని కోరుకుంటారు. షేర్ మార్కెట్‌లో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని వారికి పోస్టాఫీస్ అందిస్తున్న కిసాన్ వికాస్ పత్ర (KVP) పథకం మంచి ఎంపికగా చెప్పొచ్చు. ఇందులో పెట్టుబ‌డి పెడితే డ‌బ్బులు, డ‌బుల్ అవుతాయి.

రూ.1,000తోనే పెట్టుబడి ప్రారంభించొచ్చు

కిసాన్ వికాస్ పత్ర పథకంలో కనీసం రూ.1,000తో పెట్టుబడి ప్రారంభించవచ్చు. ఆ తర్వాత రూ.100 గుణాంకాల్లో ఎంత మొత్తమైనా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. ఇందులో గరిష్ట పెట్టుబడిపై ఎలాంటి పరిమితి లేదు.

18 సంవత్సరాలు పూర్తి చేసిన ఏ భారతీయ పౌరుడైనా సమీప పోస్టాఫీస్‌లో ఖాతా తెరిచి ఈ పథకంలో చేరవచ్చు. వ్యక్తిగతంగా లేదా సంయుక్తంగా (జాయింట్ అకౌంట్) కూడా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ పథకంపై ప్రభుత్వం 7.5 శాతం వార్షిక వడ్డీ అందిస్తోంది. ఈ వడ్డీతో పెట్టుబడి 115 నెలలు (9 సంవత్సరాలు 7 నెలలు) పూర్తయ్యే సరికి రెట్టింపు అవుతుంది.

డబ్బు సురక్షితం.. ప్రభుత్వ హామీ

ఈ పథకం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది. అందువల్ల పెట్టుబడిపై భద్రత విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం ఉండదు. షేర్ మార్కెట్ లేదా ఇతర రిస్క్ ఉన్న పెట్టుబడులతో పోలిస్తే, ఇందులో పెట్టిన డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 7.5 శాతం వడ్డీ రేటు అనేక బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD)తో పోలిస్తే ఆకర్షణీయంగా ఉంది. అందుకే రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని వారు ఈ పథకాన్ని ఎక్కువగా ఎంచుకుంటున్నారు.

అవసరమైతే ముందుగానే డబ్బు తీసుకునే అవకాశం

కిసాన్ వికాస్ పత్ర దీర్ఘకాలిక పెట్టుబడి పథకం అయినప్పటికీ, అవసరమైతే ముందుగానే డబ్బు తీసుకునే అవకాశం కూడా ఉంది. నిబంధనల ప్రకారం పెట్టుబడి పెట్టిన 30 నెలలు (2 సంవత్సరాలు 6 నెలలు) పూర్తయిన తర్వాత కొన్ని షరతుల మేరకు డబ్బును ఉపసంహరించుకోవచ్చు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో పెట్టుబడిదారులకు కొంత ఊరట లభిస్తుంది.

115 నెలల్లో పెట్టుబడి రెట్టింపు

ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే, ప్రస్తుతం ఉన్న 7.5 శాతం వడ్డీ రేటు ప్రకారం పెట్టుబడి 115 నెలలు, అంటే 9 సంవత్సరాలు 7 నెలల్లో రెట్టింపు అవుతుంది. ఉదాహరణకు, మీరు ఈరోజు రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే, 115 నెలలు పూర్తయ్యే సమయానికి అది రూ.10 లక్షలు అవుతుంది. మధ్యలో మార్కెట్ హెచ్చుతగ్గులు, నష్టాల గురించి ఆందోళన అవసరం ఉండదు. నిర్ణీత గడువు పూర్తయ్యాక రెట్టింపు మొత్తం మీకు అందుతుంది.

ఎవరికి ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది?

భవిష్యత్తు అవసరాల కోసం సురక్షితంగా డబ్బు దాచుకోవాలనుకునే వారికి ఈ పథకం అనుకూలంగా ఉంటుంది. పిల్లల ఉన్నత చదువులు, వివాహం, రిటైర్మెంట్ లేదా ఇతర దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పెట్టుబడి పెట్టాలనుకునే వారు దీనిని ఎంచుకోవచ్చు. ముఖ్యంగా రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని పెట్టుబడిదారులకు, ప్రభుత్వ హామీతో డబ్బు రెట్టింపు అయ్యే ఈ పోస్టాఫీస్ కిసాన్ వికాస్ పత్ర పథకం మంచి పెట్టుబడి అవకాశంగా చెప్పవచ్చు.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story